న్యూఢిల్లీ : కోవిడ్-19 రోగులకు వైద్య సౌకర్యాన్ని సమకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగానికి చెందిన వైద్య సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా రోగులకు ఆసుపత్రులలో పడకల లభ్యతతోపాటు పారద్శకంగా అందుబాటు ధరలలో మెరుగైన వైద్య సేవలు లభించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంబంధ విభాగాల సేవలు స్వీకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సోమవారం కోరింది. తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్, యుపి, రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయంలో చొరవతీసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ రంగానికి చెందిన వైద్య సంస్థలతో ఈ రాష్ట్రాలు చర్చలు జరిపి, కోవిడ్-19 రోగులకు తక్కువ ధరకే మెరుగైన వైద్యం లభించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రభుత్వం వివరించింది.