Saturday, April 20, 2024

తెలంగాణ గట్టుమీద సందమామయ్య

- Advertisement -
- Advertisement -

ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/ అయ్యోనివా అవ్వోనివో/ ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా/ నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు/ రాజిగా ఓరి రాజిగా/లచ్చులో లచ్చన్న/వంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా విప్లవ శంఖం పూరించాయి.

నేలతల్లిని నమ్ముకుని ఆనాదిగా జీవిస్తున్న మట్టి బిడ్డలపై తరతరాలు సాగించిన ఆకృత్యాలపై, దొరల గడీల పాలన పై తిరగబడ్డ ప్రజాకవి గూడ అంజయ్య. పల్లె అస్తిత్వాన్ని ప్రజల మనుగడను దెబ్బతీసే దొరల పెత్తందారి వ్యవస్థ పై తిరగబడ్డ మట్టి మనుషుల అగ్రహ జ్వాలలు ఆయన పాట నుండి పుట్టాయి. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన ఎన్నో పాటలను కూడా అంజయ్య రచించారు. అయ్యోడివా.. నీవు అమ్మోడివా… అంటూ దోపిడిదారులను ప్రశ్నించిన తీరు ఆయన కలానికి పదునును తెలియజేస్తుంది. తన పాటలతో యువకులను తెలంగాణ పోరాట కదనరంగం వైపు నడిపించిన ప్రజాకవి ఆయన. తెలంగాణ ఉద్యమ తోవ్వలో దివ్వెలెందరో అయినా మలిగిపోని వెలుగు దివ్వే.

తెలంగాణ ఉద్యమంలో సాహితీ శిఖరం

అంజన్న పాటల్లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఆయన పాటలు దొరలు భూస్వాముల దోపిడీని ప్రశ్నిస్తూ సమాజాన్ని కదిలిస్తాయి. రెండవ దశలో దళిత బానిస బతుకు పోరాటాన్ని చిత్రీకరిస్తాయి. మూడోదశలో మలిదశ తెలంగాణ పోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేసిన పాటలు ఉంటాయి. అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో 1955 నవంబర్ 1న జన్మించిన అంజయ్య స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని హైదరాబాద్ లో బీఫార్మసీ చదివారు. చదువు పూర్తయ్యాక ఉట్నూరులో ఫార్మసిస్ట్ గా ఉద్యోగంలో చేరారు.

ఉద్యోగంలో కొనసాగుతునే ఎన్నో ఉద్యమ గీతాలను రచించారు. సినిమాల్లో పాటలు రచించడం ప్రారంభించాక హైదరాబాద్ మకాం మార్చారు. ఆయన పాటలే కాక అనేక సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన సాహిత్య శిఖరం. నిజాం కాలంలో భూములు ఇస్తామని ఆశపెట్టి జరిపిన బలవంతపు మతమార్పిడుల గురించి రాసిన కథ ’ఇనాం శెలుక’ కథ. అలాగే ,‘గిరిజన మహిళ మేలుకో’ నాటిక అప్పట్లో పీడిత ప్రజానీకాన్ని ప్రభావితం చేసింది. నమ్మిన విశ్వాసాల కోసం అంకితమైన ఎందరో శ్రమజీవుల త్యాగాల బలిదానం మరెందరో వీరుల అమరత్వమే ఆయన పొలిమేర నవలగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా వచన కవితకు ఉద్యమస్ఫూర్తినిచ్చే గీతాలను రాసిన తెలంగాణ ఉద్యమ సృజన కారుడు అంజన్న.

పాటల పోరాట కెరటం

తెలంగాణ గట్టుమీద సందమామయ్యో… అంటూ ఈ నేలను పులకింప చేసిన పాట ఆయనది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/అయ్యోనివా అవ్వోనివో/ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా/నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు/రాజిగా ఓరి రాజిగా/లచ్చులో లచ్చన్న/వంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా విప్లవ శంఖం పూరించాయి. ఆయన రచనలకు పాటలకు పలు అవార్డులు సత్కారాలు అందుకున్నారు 1986లో సాహిత్య రత్న బంధు అందుకున్నారు. 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుండి అవార్డు అందుకున్నారు. 1996లో విశాల సాహితీ సంస్థ సన్మానం 2000లో గండే పెండేరా బిరుదుతో సత్కారం.

2004లో నవ్య సాహిత్య పరిషత్ నుండి మలయశ్రీ సాహిత్య అవార్డు,2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. నేను పాట కోసం పాట రాయలేదు ప్రజల కష్టాలను చూసి రాశాను అని చెప్పుకున్న గూడ అంజయ్య 2016 జూన్ 21న కన్నుమూశారు. కుటుంబ కష్టాలు కడుపేదరికం వల్ల ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ప్రతి ఏడాది ఆయన జయంతిని అధికారికంగా జరపటం, ట్యాంకు బండ్ పైన ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పాఠ్య పుస్తకాల ద్వారా ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయడం ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.పాట పైలం, పోరు చరిత పైలం,స్వరాష్ట్రం పైలం అంటూ హెచ్చరించిన ఆయన గాడి తప్పని జీవితం తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శప్రాయం.

 

అంకం నరేష్
6301650324

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News