హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో శనివారం విచారణ జరుగుతోంది. ఎస్ఎస్సి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ ఉత్తీర్ణతను రెగ్యులర్ గా గుర్తించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ నివేదించారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారు చేయడం ఇబ్బంది అవుతుందన్నారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా… సాంకేతిక అంశాలు ముఖ్యమా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్ గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని హైకోర్టుకు పిటిషినర్ తెలిపారు. ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదని పిటిషనర్ వాదన వినిపించాడు. పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్ధులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరాడు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.