Saturday, April 20, 2024

‘ఔ’రా.. ఔషధ రవాణా

- Advertisement -
- Advertisement -

Telangana launches ‘Medicine from Sky’ project

దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం

డ్రోన్ సేవల వినియోగంలో లీడర్‌గా భారత్
మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు,
వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి
‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య,
రాష్ట్ర మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
బేగంపేటలో విమానయాన వర్శిటీ
ఏర్పాటు చేయాలని కెటిఆర్ వినతి

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా ప్రతినిధి : దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్‌ను సరఫరా చేసే కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ప్రారంభించారు. ఇక్కడి పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు డ్రోన్ల ద్వారా ప్రయోగత్మకంగా మందులు, టీకాలు పంపిం చారు. వాటిని వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు విజయవంతంగా డెలివరీ చేశాయి.

ఈ సంద ర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మాట్లాడుతూ దే శాన్ని పురోభివృద్ధి దిశలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల మెడిసిన్‌ను సరఫరా చేయడం శుభపరిణామమన్నారు. ప్రపంచంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడంలో భారత్ లీడర్‌గా మారిందన్నారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లాలో కా ర్యక్రమాన్ని మొట్టమొదటి సారిగా ప్రారంభిస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకు డ్రోన్ సేవలు విస్తరిస్తామని చెప్పారు. పది రోజుల క్రితమే ప్రణాళికను రూపొందించి వికారాబాద్ జిల్లాలో అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు.డ్రోన్లు మారుమూల ప్రాంతాలకు సైతం అవలీలగా వెళ్తాయన్నారు.

దేశంలో మూడు జోన్లుగా ఏర్పాటు చేసి గ్రీన్ జోన్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్లు తిరిగేలా చర్యలు చేపడతామని, ఎల్లో జోన్‌లో అనుమతితో, రెడ్ జోన్‌లో అస లు డ్రోన్లు నడిపేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలల్లో పరిశోధనలు చేసి దేశంలోని ఇతర ప్రాంతాలకు మెడిసిన్ ఫ్రం స్కై సేవలను విస్తరిస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కలలు కన్న టెక్నాలజీ నేడు ఆవిష్కరితమవుతుందని అ న్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి దేశానికి దిశ నిర్ధేశాన్ని ఇస్తున్నారని అన్నారు. ప్రధాని ఆలోచనా విధానాలు దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్ర యాస్ వంటి నినాదాలతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు : కెటిఆర్

రాష్ట్రంలో సామాన్యులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డయాగ్నస్టిక్ కేంద్రాలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిందని మంత్రి కేటిఆర్ అన్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మందులను తరలించే ప్రక్రియ వికారాబాద్ జిల్లాలో ప్రారంభం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. అత్యవసరమైన మందులను అదునాతన టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్‌ల వ్యవసప్థ ద్వారా మందులను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం దావోస్‌లో వైద్యా పరిశోధకులు సమావేశం నిర్వహించి అదునాతన పపద్దతుల్లో మెడిసిన అందించి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వల్ల ప్రపంచం అల్లకల్లోలం అయ్యిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో మహిళలకు రక్షణగా కూడా డ్రోన్‌ల సహాయంతో జిపిఎస్ సిస్టంతో రక్షణగా మార్చుకోవచ్చని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దిశ సంఘటన జరిగిందని గుర్తు చేస్తూనే ఇలాంటి సంఘటనలకు అదునాతన పద్దతుల ద్వారా రక్షణగా ఏర్పాటు చేయవచ్చని అన్నారు.

అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి మ్యాప్‌ను డ్రోన్‌ల ద్వారా తయారుచేయవచ్చని పేర్కొన్నారు. అమెరికాలో డ్రోన్‌ల ద్వారా పురుగుల మందులు చల్లుతారని భవిష్యత్తులో మన దేశంలో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశంలోనే హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి 4 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 8 శాతానికి పెంచామని గుర్తు చేశారు. గత ఏడేళ్ళ క్రితం హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని పెంచడం జరిగిందన్నారు. డ్రోన్‌ల ద్వారా సీడ్ బాల్స్‌ను వెదజల్లి అడవులను అభివృద్ధి చేస్తామన్నారు. బేగంపేట్‌లో ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఇది దేశంలోని ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, పౌరవిమానయాన శాఖ ఓఎస్‌డి రమాదేవి లంక, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్ మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి, రోహిత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, సురభివాణీదేవి, వికారాబాద్, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్లు సునితామహేందర్ రెడ్డి, అనితారెడ్డి, కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల, ఎస్పీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డ్రోన్‌ల ద్వారా మందులను తరలిసంచే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించి కంపెనీ ప్రతినిధులు ప్రేమ్‌కుమార్, విక్రం, స్వప్నిక్‌లను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News