మనతెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సదరు న్యాయవాది లేఖ రాశారు. ఐదు పేజీల ఆ లేఖను ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఉమేష్ చంద్ర అందజేశారు. కొద్ది రోజుల క్రితం వనపర్తి జిల్లా కేంద్రంలో తండ్రీ కొడుకు బైక్పై వెళ్తుండగా పోలీసులు దాడి ఘటనను లేఖలో ప్రస్తావించారు. దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉమేష్ చంద్ర కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి విచక్షణ రహితంగా కొట్టారంటూ ఆరోపించారు. జ్యూడిషియల్ కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచక్షణ రహితంగా కొట్టే హక్కు పోలీసులకు ఏ విధంగా ఉందో తెలపాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో లేఖను పిల్గా హైకోర్టు స్వీకరించింది.
Telangana Lockdown: Pil filed in High Court against police