ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ అభ్యర్థులు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. శివారు మున్సిపాలిటీలన్ని ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. ఎన్నికలకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉండడం, ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో అన్నిపార్టీల అభ్యర్థులు తమ గెలుపే లక్షంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద ఎత్తున నామినేషన్ల వేసిన అభ్యర్థులు అంతే హోరాహోరీగా తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. టికెట్లు దక్కని పలు పార్టీల అభ్యర్థులు రెబల్గా బరీలో దిగడమే కాకుండా ఆయా పార్టీల కండువాలు, జెండాలతో పోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తమను గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందు వరసలో ఉండగా, మిగితపార్టీల అభ్యర్థులు సైతం వారిని అందుకునే యత్నం చేస్తున్నారు. దీంతో కాలనీలు, బస్తీలు ఎన్నికల నినాదాలతో మారుమోగుతున్నాయి. అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారం మొదల్కొని, బైక్ ర్యాలీలు, పాద యాత్రలతో అలుపెరుగకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అందివచ్చిన ఏ అవకాశం కూడా వారు వదులు కోకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
Telangana Municipal Elections 2020