Wednesday, April 24, 2024

నిలువెత్తు సంక్షేమం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana No 1 state in welfare

ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు అట్టడుగు వర్గాల సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే ప్రజలకు విద్య, వైద్యం లభించి వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. దీన్ని పరిగణనలోకి తీసుకొని సిఎం కెసిఆర్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. వ్యూహాత్మకమైన ప్రణాళికలు రచించడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి బంగారు బాటలు వేశారు. భారత రాజ్యాంగం పేర్కొన్న సమానత్వం కోసం, వివక్షలేని పాలనను కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రముఖ వ్యక్తుల, సంస్థల ప్రశంసలు పొందుతున్నారు. ఏడేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపి నిలువెత్తు సంక్షేమా రూపంగా నిలిచారు. కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు.

అందులో ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు, తాగునీరు అందిస్తున్నారు. అప్పులు చేసి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని భావించి పంటకు పెట్టుబడి అందించి వారిని ఆదుకునేందుకు రైతుబంధు ప్రవేశపెట్టారు. రెండు పంటలకు ఎకరాకు ఏటా రూ.10,000 చొప్పున పెట్టుబడి అందిస్తున్నారు. ఇప్పటి వరకు 66 లక్షల పైగా రైతులు రూ. 50,682 కోట్లు లబ్ధి పొందారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రూ. 5 లక్షలతో రైతుబీమాను అమలులోకి తెచ్చారు. గత మూడేళ్లలో 60,340 రైతు కుటుంబాలకు రూ. 3017 కోట్ల ఆర్ధిక సహాయం చేసి ఆదుకున్నారు. రూ. 17000 కోట్లతో రైతు రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఎరువులు, విత్తనాలను రైతులకు అందించారు. రైతన్న భూమికి రక్షగా ధరణితో విప్లవాత్మక మార్పు తెచ్చారు. రైతులు ఒక చోట కూర్చొని చర్చించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలు నిర్మించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ. 2016, వికలాంగులకు రూ.3016 ఆసరా పింఛన్లతో 40 లక్షల మందికి రూ. 44,171 కోట్లతో జీవన భద్రత కల్పించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రూ. 1,00,116తో కళ్యాణల, షాదీ ముబారక్ వంటి వినూత్న పథకాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 10,56,239 మంది ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించారు. పేద ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం కోసం రూపాయికి కిలో బియ్యం చొప్పున ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల బియ్యం ఇంటికి పెద్దకొడుకై అందిస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా గర్భవతులైన మహిళలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, ప్రసవానంతరం తల్లీబిడ్డకు అవసరమైన 16 వస్తువులతో 12.53 లక్షల మందికి కెసిఆర్ కిట్ ఇచ్చారు. గర్భవతిగా ఉన్న మహిళలకు పౌష్టికాహారంతో పాటు, ఆదాయం సమకూర్చేందుకు రూ. 12000, ఆడపిల్లను కన్న తల్లికి అదనంగా రూ.1000 ఇచ్చి ఆదుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సాహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్, డయాగ్నస్టిక్ సెంటర్లు, కేన్సర్ పరీక్ష కేంద్రాలు, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి వాటితో ప్రజా వైద్యాన్ని అభివృద్ధి చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 1.5 కోట్ల మందికి కంటివెలుగు ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు పంపిణీ చేశారు.

మునుపెన్నడూ లేని విధంగా ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధిలో ఒక ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే అవి మరుసటి సంవత్సరానికి బదలాయించే విధంగా చట్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల కోసం కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేశారు. 2014 నాటికి 298 గురుకులాలు ఉండగా నేడు రాష్ట్రంలో 970 ఉన్నాయంటే విద్యారంగంలో సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. విదేశీ విద్య పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 లక్షల సహాయంతో 3386 మంది విద్యార్థులు రూ. 580 కోట్లతో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఎకనామికల్ సపోర్ట్ స్కీంలో భాగంగా సబ్సిడీ రుణాలను అందించారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత ఎంటర్‌ప్రెన్యూర్ (T-Pride) అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు.

ఎస్‌సి, ఎస్‌టి మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీ 35 శాతం నుండి 45 శాతానికి పెంచారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కోసం భూమి లభ్యతను బట్టి కొనుగోలు చేసి అందించారు. ఇంతటితో ఆగక దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతో దళిత బంధు తెచ్చారు. గిరిజనుల అభివృద్ధి పథంలో నడిపించేందుకు స్వయంపాలన కోసం తండాలు, ఆదివాసీ గూడాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు. బంజారా భవన్ నిర్మాణం చేపట్టారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. దళిత, గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయుటకు అన్ని ఇండస్ట్రియల్ పార్కులలో 22 శాతం మేరకు స్థలాలను రిజర్వ్ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. బిసిల అభ్యున్నతి కోసం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలను వ్యాపార వేత్తలుగా తయారు చేయటానికి వైన్ షాప్‌లలో రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే పేరుతో బిసి గురుకులాల ద్వారా అద్భుతమైన విద్య అందిస్తున్నారు.

అన్ని కులాల ఆత్మగౌరవం పెంచేందుకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టారు. పోరాట యోధులైన సర్వాయి పాపన్న, కొమరంభీం, చాకలి ఐలమ్మల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారంగా నిర్వహించారు. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా గొర్రెల పంపిణీ ద్వారా గొల్ల కురుమల, చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇప్పటి వరకు రూ.4780 కోట్లతో 7,72,737 గొర్రెలను 3.81 లక్షల మందికి పంపిణీ చేశారు. అదే విధంగా రూ.268.37 కోట్లతో చేప పిల్లలను, రూ.11.64 కోట్లతో రొయ్య పిల్లలను కొనుగోలు చేసి మత్స్యకారులకు అందించారు. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేశారు. సబ్సిడీ యంత్రాలు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నుండి నేతన్నలను కాపాడారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్స్, అలాగే దళితులకు 100 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. మేదరి, వడ్డెర, విశ్వకర్మ, గౌడ తదితర కుల వృత్తుల వారందరికీ ఆర్థిక సహకారం ఇచ్చి పరికరాలు పంపిణీ చేశారు. గౌడ కులస్థులే నీరా తీయటం, విక్రయించేలా నీరా పాలసీని రూపొందించారు. కల్లుగీత, మత్స్యకారులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అందించారు. అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రతియేటా రూ.1000 కోట్లతో ప్రత్యేక ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

మైనార్టీల పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించారు. ముస్లిం అనాథ పిల్లల ఆశ్రయం కోసం నివాస స్థలాన్ని, భవన నిర్మాణం కోసం రూ. 20 కోట్లు కేటాయించారు. రంజాన్, క్రిస్మస్ పండగలకు ప్రతి ఏటా కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇమామ్, మౌజమ్లకు నెలకు రూ.5 వేల చొప్పున 10 వేల మందికి గౌరవ వేతనం ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కెసిఆర్ పెద్దపీట వేశారు. పిఆర్‌సి అమలు, పదోన్నతులు, మౌలిక సదుపాయాలు కల్పించి ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా వ్యవహరించారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో పేదల పాలిట పెన్నిధిలా నిలుస్తున్నారు. ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. ఒక్క రూపాయి కొత్త పన్ను వేయకుండా సంక్షేమ పథకాలన్ని అర్హులందరికీ అందించారంటే ఆయన దార్శనీకత ఎంత గొప్పదో అర్ధమవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టని అనేక పథకాలను కెసిఆర్ అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నారనే భరోసా రైతుకు, తన వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నారని భరోసాను ప్రతి రోగికి, పిల్లల చదువుకు మా ముఖ్యమంత్రి ఉన్నారనే భరోసా తల్లిదండ్రులకు, తలెత్తుకొని నడిచే సాధికారిత మహిళలకు, శేష జీవితానికి దిగులులేదనే భరోసాను వృద్ధులకు కల్పించిన గొప్ప మానవీయ ముఖ్యమంత్రి మన కెసిఆర్. ఇలా అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నారు.

డా.బోల్లికొండ వీరేందర్- 9866535807
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News