Wednesday, April 24, 2024

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి
విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి
విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి
ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు
ప్రభుత్వ పథకాలు సత్వరం అంది గిరిజనుల జీవన విధానం మెరుగుపడేలా పనిచేయాలి
తక్కువ నిధులతో, ఎక్కువమందికి లబ్ది చేకూరే పథకాల అమలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఐటిడిఎను గిరిజనుల సమగ్ర వికాస సంస్థలుగా రూపొందించండి
సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం

 

మన తెలంగాణ/హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వైరస్ పట్ల….. ఈ వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటిడిఎల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల భద్రత, పరీక్షల పట్ల శ్రద్ధ, విద్యాలయాల్లో కరోనా వైరస్ పట్ల అప్రమత్తతపై బుధవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి సమీక్ష చేశారు. ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తప్ప మిగిలిన విద్యార్థులందరికీ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా సెలవులు ప్రకటించిన సందర్భంగా బోర్డు పరీక్షలకు హాజరయ్య విద్యార్థుల ఉత్తీర్ణత, స్కోర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని సూచించారు. గత సంవత్సరం డిసెంబర్ నుంచే పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యక తరగతులు పెట్టి ట్యూషన్లు, కోచింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంచి మార్కులు సాధించేలా విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

పదో తరగతి, ఇంటర్ పరీక్షల కోసం డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు కచ్చితంగా విద్యా సంస్థల్లో పరీక్షలు పూర్తయ్యే వరకు అందుబాటులోనే ఉండాలన్నారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలున్నందున పరీక్షలకు వెళ్లే విద్యార్థుల వెంట పరీక్షల కేంద్రాలకు ఉపాధ్యాయులు తోడుగా వెళ్లాలన్నారు. పరీక్ష పూర్తికాగానే విద్యార్థులు గుమి కూడకుండా వెంటనే మళ్లీ పాఠశాలలకు తీసుకురావాలన్నారు. గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి సెలవులిచ్చినందున, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గదిలో ఉంచవద్దన్నారు. ఎక్కువ గదుల్లో తక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గిరిజన విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా వైరస్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, విద్యార్థులకు మధ్య, విద్యార్థులు – ఉపాధ్యాయులకు మధ్య 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులను వీలైనంత వరకు రాకుండా ఉండేందుకు ముందే వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి వచ్చే సూచనలు, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. ఐటిడిఎలలోకి కొత్తగా వచ్చే వ్యక్తుల ద్వారాగానీ, ఇతర మార్గాల ద్వారాగాని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అదే సమయంలో కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు, లక్షణాలున్నట్లు కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు.

ఐటిడిఎలంటే గిరిజన సమగ్ర వికాస కేంద్రాలుగా బాసిల్లే విధంగా కొత్తగా వచ్చిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు అంకిత భావంతో, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలన్నారు. అట్టడుగున ఉండి, అడవుల్లో ఉన్నగిరిజనులకు సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజనుల మన్ననలు పొందేలా పనిచేయాలని సూచించారు. ఐటిడిఎలలో గిరిజనులకు ఉపయోగపడే కుటీర పరిశ్రమలు స్థాపనకు కృషి చేయాలన్నారు. గుడుంబా బాధిత కుటుంబాలకు, వితంతువులకు ఆసరా కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో బడ్జెట్ పట్ల సమగ్ర అవగాహనతో ఉన్న నిధుల ద్వారా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా, ప్రభుత్వ పథకాలు పటిష్టంగా, సత్వరంగా లబ్దిదారులకు చేరేలా తమ మార్కు పాలన చేయాలన్నారు. సిఎం కెసిఆర్ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్న సమయంలో వాటన్నింటిని లబ్దిదారులకు చేర్చి ప్రభుత్వం వారికోసం చేస్తున్న కృషి అర్ధమయ్యేలా ప్రాజెక్టు అధికారుల పనితీరు ఉండాలని ఆకాంక్షించారు.

గిరిజనుల కోసం ఇంకా ఎలాంటి పథకాలు, పనులు చేస్తే వారి వికాసానికి ఉపయోగపడుతాయో కూడా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులుగా ఆలోచించి, రూపొందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని నిరక్షరాస్యత నిర్మూలించేందుకు సిఎం చెప్పిన ఈచ్ వన్ టీచ్ వన్ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ఏటూరు నాగారం ఐటిడిఎ అధికారి మేడారం వెళ్లి జాతర అనంతర పనులు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉట్నూరు ఐటిడిఎ పిఒ భవేష్ మిశ్రా, భద్రాచాలం ఐటిడిఎపి.ఓ గౌతమ్, ఏటూరు నాగారం ఐటిడిఎపి పి.ఓ హన్మంతు, మన్ననూరు ఐటిడిఎపి అఖిలేశ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ మురళికృష్ణ, ట్రైకార్ డిజిఎం శంకర్ రావు, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు విజయలక్ష్మి, నరోత్తమ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News