Friday, March 29, 2024

ఎపిలోని నాగార్జున వర్సిటీ ముందు తెలంగాణ విద్యార్థుల ఆందోళన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఎపిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. తెలంగాణలో నాగార్జున వర్సిటీ జారీ చేసిన డిస్టెన్స్ కోర్సుల సర్టిఫికెట్లు చెల్లవని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్లలో పొందుపరుస్తోందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు వారు మాట్లాడుతూ.. ఇదే విషయమై తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులతోపాటు, మంత్రులు హరీశ్‌రావు సబితా ఇంద్రారెడ్డిని కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నోటిఫికేషన్లు వస్తున్నాయని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు.

సొంత రాష్ట్రంలో న్యాయం జరగకపోవడంతోనే నాగార్జున వర్సిటీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. 2020 వరకు నాగార్జున వర్సిటీ సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యాయని, ఉద్యోగాలకు, ప్రవేశ పరీక్షలకు అనుమతించారని తెలిపారు. విద్యార్థులకు ముందస్తుగా ఏ మాత్రం అవగాహన కల్పించకుండా.. తీరా కోర్సులు పూర్తి చేశాక జురీస్డిక్షన్ అంశాన్ని తెరపైకి తెచ్చి సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. ఉన్నత విద్యా మండలి నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ స్టడీ సెంటర్లలో డిగ్రీలు, పిజిలతోపాటు ఇతర కోర్సులు చదివిన పలువురు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News