Friday, March 29, 2024

జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Tenth class exams starting June 8th

 

పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు
విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ ఏర్పాటు
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధినిస్తూ ఈ పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల సందర్భంగా శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో గతంలో వాయిదా వేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అంగీకరించడంతో ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించాలన్న హైకోర్టు సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగిగంచుకోబోతున్నామని చెప్పారు. గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాల్లోనూ, గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రానికి అర కిలోమీటర్ లోపలే నూతన పరీక్షా కేద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల మార్పును సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఛీఫ్ సూపరింటెండెంట్ ద్వారా తెలియజేస్తామని వివరించారు.

ప్రతి రోజూ కేంద్రాల శానిటైజేషన్

పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులను అందజేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి గంట ముందు అనుమతిస్తామని, విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రానికి ముందే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కోవిడ్-1 నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను నడుపుతుందని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయించనున్నట్లు వివరించారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్నవారితో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులను నిర్వర్తించే సిబ్బంది ప్రత్యేకంగా మాస్కులను ధరించడంతో పాటు చేతులకు గ్లౌజులను కూడా ధరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్థమవ్వాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News