ఖమ్మం : ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యువకుడి వేధింపులతో ఈ నెల9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలిక(15) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే గత కొంత కాలంగా తనను ప్రేమించాలని యువకుడు సాయి ఆమెను వేధిస్తున్నాడు.ఈ క్రమంలో ఈ నెల 9న నిందితుడు బాలికపై ఒత్తిడి చేశాడు. దీంతో విద్యార్థిని వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది.
దీంతో స్థానికులు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని వెంటనే బాలికను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న బాలిక నిన్న రాత్రి.. పరిస్థితి విషమించి మృతిచెందింది.ఈ ఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడు సాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా బాలిక మృతి అనంతరం ఆమె బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.