ప్యారిస్: ఫ్రాన్స్కు చెందిన నైస్ నగరంలోని ఒక చర్చిలో గురువారం తీవ్రవాదిగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి కత్తితో ఒక మహిళ తలనరికి మరో ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు. అల్లాహో అక్బర్ అని అరుస్తూ ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిని తీవ్రవాద చర్యగా నైస్ నగర మేయర్ క్రిస్టియన్ ఇస్ట్రోసి అభివర్ణిస్తూ ఈ సంఘటన నగరంలోని అతిపెద్ద నోట్రే డామే చర్చి లోపల లేదా సమీపంలో జరిగిందని ఆయన తెలిపారు. దాడి చేసిన వ్యక్తి అల్లాహో అక్బర్ అంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా పదేపదే అరిచాడని ఆయన తెలిపారు. చర్చిలో మరణించిన వ్యక్తులలో చర్చి వార్డెన్ కూడా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.
అదుపులోకి తీసుకునేముందు పోలీసులు జరిపిన కాల్పులలో నిందితుడు గాయపడ్డాడని, ఆసుపత్రిలో అతను కోలుకుంటున్నాడని ఎస్ట్రోసి విలేకరులకు తెలిపారు. ఇప్పటి వరకు జరిగింది చాలని, శాంతికాముక దేశమైన ఫ్రాన్స్లో ఇస్లామిక్ ఫాసిజంను అంతం చేయడానికి చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రోన్ నైస్ నగరాన్ని సందర్శించాల్సి ఉందని ఎస్ట్రోసి చెప్పారు. మృతులకు సంతాపసూచకంగా జాతీయ పార్లమెంట్లో సభ్యులు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.