Wednesday, April 17, 2024

ఉగ్రవాదులు లాహోర్ లోనే తిరుగుతున్నారు కదా… జావెద్ అక్తర్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ పాకిస్థాన్‌ను ఆ దేశం లోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ స్మారకార్థం ఇటీవల లాహోర్‌లో ఫైజ్ ఫెస్టివల్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జావెద్ అక్తర్ కు ఆహ్వానం లభించడంతో ఆయన పాక్‌లో పర్యటించారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన, అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ భారత్‌పాక్ సంబంధాలు , ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. “ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. పై గా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. వాటిని తగ్గించాల్సిన అవసరముంది. మేం ముంబైకి చెందిన వాళ్లం. మా నగరంలో ఉగ్రవాదులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో మా కళ్లారా చూశాం. వారు (ముష్కరులు) నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదు.

వాళ్లు ఇంకా మీ దేశం లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు” అని అక్తర్ వ్యాఖ్యానించారు. ఇక భారత ఆర్టిస్టులను పాక్‌లో గౌరవించక పోవడాన్ని ఆయన తప్పు పట్టారు. నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా? ”అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

2008 నవంబరు 26 న పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ముంబై లోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోగా, నాలుగేళ్ల తరువాత 2012 లో అతడిని ఉరితీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News