లండన్ : పది నిముషాల్లో కరోనా వైరస్ను గుర్తించే రెండు వైద్య కిట్లను రూపొందించామని బ్రిటిష్ కంపెనీలు ప్రకటించడం వివాదం రేపుతోంది. ఇవి అంత కచ్చితంగా గుర్తించవని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. డెర్బీ స్థావరంగా ఉన్న సూర్ స్క్రీన్ డయాగ్నస్టిక్స్ రూపొందించిన కిట్ కరోనాకు గురైన వ్యక్తిని 98 శాతం వరకు కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ ప్రైవేట్ సంస్థ ఈ పరీక్ష బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, నెథర్లాండ్స్, టర్కీ, యుఎఇ, కువాయిట్, ఒమన్, దేశాల్లో వాడుకలో ఉన్నట్టు చెబుతోంది. మరో కంపెనీ మొలాజిక్ ఆఫ్రికాలో వైరస్ను పది నిముషాల్లో గుర్తించే కిట్ను రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ నివారణకు కావలసిన పరిశోధనకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంస్థకు ఒక మిలియన్ పౌండ్లను కేటాయించింది.
మూడు నెలల్లో ఈ కంపెనీ పది నిముషాల్లో వైరస్ను గుర్తించే కిట్ను రూపొందిస్తుందని, ఒక డాలరు కన్నా తక్కువ ఖరీదులో దీన్ని అందుబాటు లోకి తెస్తుందని నమ్ముతున్నారు. ఇంగ్లాండ్ లోని ప్రజారోగ్య సంస్థ ఈ పరీక్షల్లో విశ్వసనీయత ఉండదని, వీటిని అంతగా నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ను గుర్తించడానికి వాణిజ్యపరంగా అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయని అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతానికి అధికారికంగా నమూనాల బట్టి వైరస్ను గుర్తించడానికి వాటి ఫలితాలు రాడానికి 24 నుంచి 48 గంటలు పడుతోంది.
అయితే సూర్స్క్రీన్ డయాగ్నస్టిక్స్ డైరక్టర్ డేవిడ్ క్యాంప్బెల్ కరోనా వైరస్ పరీక్ష రూపకల్పనకు ఎక్కువగా శ్రమిస్తున్నామని, రోగి చేతి వేళ్ల నుంచి రక్తం సేకరించి పది నిముషాల్లో గుర్తిస్తామని చెప్పారు. సూర్స్క్రీన్ కిట్ ద్వారా ఇంతవరకు 175000 పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. వచ్చేనెల వరకు రెండు మిలియన్ ఆర్డర్లు వచ్చినట్టు తెలుస్తోంది, బెడ్ఫోర్డ్ లోని మొలాజిక్ కంపెనీ సెనెగల్ లోని సహచరులతో కలిసి ప్రభుత్వ నిధులతో పరీక్షలను వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. మొలాజిక్ గతంలో ఎబోలా, ఎల్లోఫీవర్, పొంగు వ్యాధులకు ఇలాంటి పరీక్షలనే అభివృద్ధి చేసింది. 200 మిలియన్ జనాభా కలిగిన నైజీరియాలో కరోనా వైరస్ను గుర్తించే ప్రయోగశాలలు ఐదు మాత్రమే ఉండడం గమనించ దగ్గ విషయం.