24గంటల కరోనా హెల్ప్లైన్ 104
కరోనా గాలి ద్వారా సోకదు
నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది
కరచాలనం, కౌగిలింతలు వద్దు
వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది
వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది
చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా అంటే
అవకాశాలు 85% ఉండవు n అన్ని జలుబులు కరోనా కాదు
జలుబు వస్తే వైద్యులను సంప్రదించడం మంచిది
చనిపోతారనే సోషల్మీడియా ప్రచారం నమ్మవద్దు
80వేల మందికి సోకితే 3వేల మందే మరణించారు
గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశాం
చెస్ట్, వికారాబాద్ దవాఖానాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం
మెడికల్ కాలేజీల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు అవుతాయి
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్19 (కరోనా) వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రివర్గ ఉపసంఘం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించింది. ఆ తరువాత మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్పై భయబ్రాంతులకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. కొవిడ్19 వస్తే ఖచ్చితంగా చనిపోతారని కొందరు సోషల్ మీడియాల్లో వదంతులు సృష్టిస్తున్నారని వాటిలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 88 వేల మందికి కరోనా సోకగా, వారిలో ఇప్పటి వరకు కేవలం 3వేల మంది వరకు మాత్రమే మరణించారని ఆయన వివరించారు.
మిగతా వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారిలో దాదాపు 81 శాతం మందికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటం వలన ఆటోమేటిక్గా తగ్గిపోతుందని, మిగతా 14 శాతం మందికి ట్రీట్మెంట్ జరిగిన అనంతరం క్యూర్ అవుతున్నారని, మరో 3 శాతం మంది రిస్క్లో ఉంటున్నారని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ సోకకుండా ఉంటుందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, అతనికి గాంధీ ఐసోలేషన్ వార్డులోనే ప్రత్యేక చికిత్సను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అతనితో ప్రత్యక్షంగా కలిసిన వారిలో దాదాపు 88 మందిని గుర్తించామని, ఇప్పటికే 45 మందిని గాంధీ ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.
బుధవారం సాయంత్రం వరకు రిపోర్టుల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ 88 మందికి 14 రోజుల పాటు పూర్తిస్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అందిస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా, సోకినట్లు గుర్తించిన ఇతర సందేహాల కొరకు హెల్ప్లైన్ నెం 104 ను వినియోగించుకోవాలని మంత్రి ఈటల తెలిపారు. ఈ హెల్ఫ్లైన్ 24 గంటల పాటు పనిచేస్తుందని ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నంబరుకు సంప్రదించాలని మంత్రి తెలిపారు.
కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి
కొవిడ్ వైరస్ గాలి ద్వారా ఇతరులకు వచ్చే ఆస్కారం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేవలం తుంపర్లు ద్వారా మాత్రమే ఈ వైరస్ ఇతరులకు సోకుతుందని ఆయన తెలిపారు. ఈ వైరస్ గాలిలో దాదాపు 12 గంటల పాటు జీవించి ఉంటుందని, కరోనా వ్యాధిగ్రస్తుడు వాడిన వస్తువులను ముట్టుకుంటే తప్పా, వేరే వ్యక్తులకు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా బారి నుంచి 85 శాతం వరకు తప్పించుకోగల్గుతామని అన్నారు. అదే విధంగా అన్ని జలుబులు కరోనా కాదని, కానీ జలుబు వచ్చినా ముందస్తు జాగ్రత్తలో భాగంగా వైద్యులను సంప్రదిస్తే మేలని అన్నారు. వదంతులు నమ్మి ఆగం కావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
గాంధీ, మిలట్రీ, చెస్ట్, వికారాబాద్, ఫీవర్, ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు
కరొనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తుంది. ఇప్పటికే గాంధీ, ఫీవర్, ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయగా, తాజాగా చెస్ట్, వికారాబాద్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు, ప్రయివేట్ కళాశాల్లో కూడా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అనుమానిత లక్షణాలు వారి సంఖ్య పెరుగుతుంటే ప్రతి మెడికల్ కాలేజిల్లో 200 పడకలతో ఐసోలేషన్ వార్డులు, 50 బెడ్లలో చికిత్స వార్డులను ఏర్పాటు చేస్తామని ఈటల వెల్లడించారు. ప్రతి మెడికల్ కాలేజిల్లో సుమారు 200 నుంచి 300 మందికి చికిత్సను అందించేందుకు తొలి విడతగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మాస్క్ల పంపణి కూడా జరుగుతుందని తెలిపారు. వీలైనంత వరకు గుంపులు గుంపులు మధ్య తిరగకపోవడం మంచిదని మంత్రి సూచించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజిలు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు తదితర రద్దీ ప్రాంతాల్లో తిరిగేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తుంపర్లు వస్తే ఖచ్చితంగా హ్యండ్ కచ్చిఫ్ ఉపయోగించాలని అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న టెంపరేచర్కు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువని, ఒకవేళ వచ్చినా అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని వైద్య మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రివెంటివ్ మెడిసిన్ని కూడా అన్ని ఆసుప్రతుల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
వ్యాపారం చేస్తే సహించేది లేదు
కరోనా పేరిట ప్రజలను భయబ్రాంతులకు చేసి వ్యాపారం చేస్తే సహించేది లేదని మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను హెచ్చరించారు. రోగికి కరోనా అనుమానిత లక్షణాలు వస్తే ఖచ్చితంగా వైద్యాధికారులకు తెలపాలని మంత్రి సూచించారు. అదే విధంగా విదేశాల నుంచి వచ్చే రోగుల నుంచి అన్ని వివరాలు సేకరించాలని, దీనితో పాటు ప్రతి పేషెంట్ పరిస్థితి క్షణ్ణంగా పరిశీంచాలని మంత్రి తెలిపారు.