చైనాలోని కరోనా జన్మస్థానం వుహాన్లో గాలిలో వైరస్ జన్యువులున్నట్టు షాకింగ్ ఆనవాళ్లు
రెండు ఆసుపత్రుల నుంచి సేకరించిన తుంపర్లపై అధ్యయనం గాలిలో రెండు గంటల పాటు తచ్చాడినట్లు పరిశోధకుల ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందా అనే అనుమానాలను నిజం చేసే విధంగా వుహాన్లో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గాలి ద్వారా ఏర్పడిన చిన్న చిన్న బిందువుల్లో వైరస్ జన్యవులు ఉన్నట్లు గుర్తించారు. అతి సూక్ష్మస్థాయిలో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వుహాన్లోని డాక్టర్లు రెండు హాస్పిటళ్ల నుంచి సూక్ష్మ తుంపర్లను సేకరించారు. వాటిని అధ్యయనం చేస్తే డ్రాప్లెట్స్లో వైరస్ జెనెటిక్ మార్కర్ ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఏరోసోల్ ట్రాన్స్మిషన్ గుురించి తెలుసుకునే క్రమంలోనే ఈ పరిశోధనలు జరిగాయి. అయితే వారు సేకరించిన శాంపిళ్లలో ఉన్న వైరస్ ప్రమాదకరమైందా లేదా అన్న విషయాన్ని వాళ్లు నిర్ధారించలేదు. శ్వాస తీసుకోవడం, వదలడం ద్వారా వచ్చే తుంపర్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ తుంపర్లు గాలిలో సుమారు రెండు గంటలు ఉంటాయని ప్రొఫెసర్ లిన్సే మార్ తెలిపారు. అంటే ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపించగలదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అయితే అది ప్రమాదకరమో కాదో చెప్పలేదు. ఏరోసోల్స్ అనే చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి అవుతుందని డాక్టర్ మార్ తెలిపారు. వుహాన్లోని రెన్మిన్ హాస్పిటల్ నుంచి శ్యాంపిళ్లను ఫిబ్రవరి, మార్చిలో సేకరించారు. అలాగే ఆ నగరంలోని కొన్ని పబ్లిక్ ప్రాంతాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్లు, సూపర్మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్ల వద్ద కూడా శ్యాంపిళ్లను సేకరించి పరీక్షించారు. హాస్పిటళ్లలోని పేషెంట్ల రూమ్లు, ఐసోలేషన్ వార్డుల వద్ద స్వల్ప స్థాయిలో వైరస్ను గుర్తించారు. కానీ టాయ్లెట్ ప్రాంతాల్లో మాత్రం వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. వెంటిలేషన్ సరిగా లేని చిన్న చిన్న టాయ్లెట్లలో వైరస్ తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వైద్య సిబ్బంది దుస్తులు మార్చుకునే రూమ్ల్లో కూడా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు పసికట్టారు. వుహాన్లోని పబ్లిక్ ప్రాంతాల్లో మాత్రం వైరస్ ఛాయలు కనిపించలేదని నెబ్రస్కా మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ జాషువా సంతర్పియా పేర్కొన్నది. సూపర్మార్కెట్, రెసిడెన్షియల్ బిల్డింగ్ల వద్ద కూడా వైరస్ ఉన్నట్లు గుర్తించలేదు.