హైదరాబాద్ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు విద్యార్థులకు మాత్రమే అని, ఉపాధ్యాయులకు కాదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. సోమవారం కరోనాపై విద్యాశాఖ స్పెషల్ సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు యథావిధిగా పాఠశాలలకు వెళ్లాలని తెలిపారు. ఎస్ఎస్సి పరీక్షల విధులు నిర్వహించే వారు విధులకు హాజరుకావాలని, మిగిలిన వారు పాఠశాలకు వెళ్లి పెండింగ్ రికార్డ్ రాసుకోవాలని తెలిపారు. గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
సర్కులర్ జారీ చేసిన వరంగల్ డిఇఒ
కరోనా వైరస్ నేపథ్యంలో సోమవారం(మార్చి 16) నుంచి ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు విద్యార్థులకు మాత్రమే అని, ఉపాధ్యాయులకు కాదని వరంగల్ అర్బన్ డిఇఒ కె.నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సర్కులర్ జారీ చేశారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు యథావిధిగా పాఠశాలకు హాజరు కావాలని పేర్కొన్నారు. టీచర్లు అన్ని రకాల రికార్డులు, రిజిష్టర్లను పూర్తి చేయడంతో పాటు యు డైస్, వెబ్సైట్ను అప్డేట్ చేయడం, సిసిఇ మార్కులు, ఎఫ్ఎ 3, ఎఫ్ఎ 4 మార్కులను వెబ్సైట్లో నమోదు చేయడం, ఎస్ఎంసి సమాచారాన్ని టీ హాజరులో నమోదు చేయడం, హెచ్ఎం ఆదేశాల మేరకు పాఠశాల అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.