మునగాల: సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, మొద్దుల చెర్వు స్టేజి సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ రంగారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎపిలోని కృష్ణా జిల్లా, కృటివేలు మండలం, ఇంటేలి గ్రామానికి చెందిన వొదుగు నాగమల్లేశ్వరరావు(40), అతని భార్య మావులమ్మ(35), కూతురు దుర్గ(16), కుమారుడు కొండబాబు హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాగమల్లేశ్వరరావు రోజువారి కూలీ. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి అద్దె కారులో విజయవాడకు వెళ్లారు.
అక్కడ పనులు ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరారు. మార్గ మధ్యలో మునగాల మండలం, మొద్దుల చెర్వు సమీపంలో కారు పక్కకు ఆపి మూత్ర విసర్జన చేశారు. తిరిగి కారు ఎక్కబోతుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారు అతివేగంగా ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగమల్లేశ్వరరావు, మావులమ్మ, దుర్గ అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు కొండబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివశంకర్గౌడ్, ఎస్ఐ కారింగుల సత్యనారాయణగౌడ్ తెలిపారు.