పరిస్థితి సాధారణం అయ్యాకే పాఠశాలల పునః ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతనే పాఠశాలలు పునఃప్రారంచాలని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆన్లైన్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించడం అలవాటు చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించింది. విద్యార్థులు నష్టపోకుండా సిలబస్ను పూర్తిచేసేలా ప్రణాళిక రూపోందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరిస్థితి సాధారణం అయ్యాకే 50 శాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా పాఠశాలలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయడంతో పాటు ఒకటి నుంచి 9వ తరగతి వరకు అన్ని రకాల పరీక్షలు రద్దు చేసి ఆయా తరగతులను విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేశారు. సెలవుల్లో కొన్ని పాఠశాలలు ఆన్లైన్ ద్వారా బోధన కొనసాగించాయి.
నెలాఖరులో పరిస్థితిని బట్టి నిర్ణయం
రాష్ట్రంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1 తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కావాలి. కానీ స్కూళ్ల రీ ఒపెనింగ్పై విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపులతో లాక్డౌన్ అమలు చేస్తున్నా పాఠశాలల పునః ప్రారంభించడానికి ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నెల చివరి వారంలో పరిస్థితులను బట్టి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం స్కూళ్ల రీ ఒపెనింగ్ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఆటోమెటిక్గా పాస్ చేసి పైతరగతికి ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత సబ్జెక్టు టీచర్లు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాలి. దీంతో వారికి అదనంగా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది దాంతో పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.