Friday, March 29, 2024

ఆలయాల్లో బారులు తీరిన భక్తులు

- Advertisement -
- Advertisement -

 

tholi ekadasi 2021 in telugu

తొలి ఏకాదశిని పురస్కరించుకొని అందంగా ఆలయాలు ముస్తాబు
తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు
విష్ణు నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

హైదరాబాద్: తొలి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు బారులు తీరారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు వైభవంగా జరుపుకున్నారు. ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ ఏకాదశి మొదటిది. ఈ సందర్భంగా తెలంగాణలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అన్నీ దేవాలయాల్లో అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనల ఉల్లంఘన జరగకుండా అన్ని ఆలయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల మాస్కు ధరించి, శానిటైజర్ వాడేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు.

శ్రీవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో…

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామి వారికి అనుబంధ పరివార దేవతలకు అర్చకులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్ర మహాపూజ, అఖండ భజన కార్యక్రమం అధికారులు నిర్వహించారు.

ఐనవోలు మల్లికార్జున ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

వరంగల్ పట్టణంలోని ఐనవోలు మల్లికార్జున ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంభిక అమ్మవారికి శాకాంహరి (కూరగాయలతో అలంకరణ) చేశారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురవాలని ఒంటిమామిడి పల్లి గ్రామాల మహిళలు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. హన్మకొండలోని శ్రీదేవి, భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహాస్వామి సన్నిధిలో

తొలి ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహాస్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన జరిపారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కరోనా నిబంధన మధ్య వారు స్వామి వారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

గోదావరి నదిలో స్నానమాచరించిన భక్తులు

పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నదిలో స్నానమాచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి తీరంలో గౌతమేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి మొక్కలు చెల్లించారు. మంథనిలో శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోయడం వల్ల మంథనిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంథని మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు ఎప్పటికప్పుడు గోదావరి పరిసరాలను శుభ్రం చేస్తూ భక్తులకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.

మధిరలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో…

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తొలి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మధిరలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీకల్యాణ వెంకటేశ్వరాలయం, బంజారా కాలనీలోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వరాలయం, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు.

Tholi ekadasi 2021 in telugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News