Friday, March 29, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

15క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, సిటిబ్యూరో: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, హోండా కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. జోగులాంబ జిల్లా, వడ్డేపల్లి మండలం, శాంతినగర్ గ్రామానికి చెందిన మన్నెం లక్ష్మినారాయణ రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్‌లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు.

ఎపిలోని అమరావతి మండలం, ధరణికుంట గ్రామానికి చెందిన నబూరి శ్రీనివాస రావు వ్యవసాయం చేస్తున్నాడు, కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా, నాగిరెడ్డిపల్లికి చెందిన నారాయణ రెడ్డి ఎపిలోని అన్నమయ్య జిల్లా, కొత్తకోట మండలం, బీరంగి పోస్టు, గుడిపల్లి గ్రామంలో ఉంటున్నాడు. లక్ష్మినారాయణకు శ్రీనివాస రావుతో పదేళ్ల నుంచి స్నేహం ఉంది. మూడేళ్ల నుంచి ఇద్దరు కలిసి కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి తెలంగాణ, ఎపి, ఒడిసాకు చెందిన అమాయక రైతులకు విక్రయిస్తున్నారు. నకిలీ బీటీ సీడ్స్ రూ.550లకు కిలో చొప్పున కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. వాటిని తీసుకుని వచ్చి మన్సురాబాద్‌లో నిల్వ చేశారు, వాటిని అమాయకులైన రైతులకు రూ.1,200లకు విక్రయించేందుకు యత్నిస్తున్నారు.

మన్నెం లక్ష్మినారాయణను ఖమ్మం పోలీసులు 2019లో అరెస్టు చేశారు. బెంగళూరు పోలీసులు నిందితుడిపై ఆరు కేసులు నమోదు చేశారు. రాచకొండ పోలీసులు 2020లో అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టారు. అమాయకులైన రైతులకు విక్రయించేందుకు మళ్లీ ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యవసాయ అధికారి సుజాత, సక్‌లేశ్వర్, ఇన్స్‌స్పెక్టర్లు అంజిరెడ్డి, ఎండి తకియుద్దిన్, ఎస్సైలు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News