హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఎల్బి నగర్ కోర్టు మూడేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని బోరబండ, స్నేహపురి కాలనీకి చెందిన యువతి ఇంజనీరింగ్ చేస్తోంది. రోజు మాదిరిగానే 23, జూన్, 2014లో కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. విద్యార్థిని ఆచూకీ తెలుసుకున్నారు. బాధితురాలి అసలు విషయం చెప్పడంతో సనత్నగర్, హఫీజ్పేటకు చెందిన సెంట్రింగ్ పనిచేసే అనిల్ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేసిన అప్పటి సనత్నగర్ పిఎస్ ఇన్స్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి సాక్ష్యాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది. నిందితుడికి శిక్ష పడే విధంగా చేసిన అధికారులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.