Saturday, April 20, 2024

‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ అమలుకు తిరుపతి రైల్వేస్టేషన్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

Tirupati Railway Station for implementation of ‘One Station One Product’

దక్షిణమధ్య రైల్వే జిఎం సంజీవ్ కిశోర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ను అమలు పరచడానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. తిరుపతి స్టేషన్ పరిసర ప్రాంతాలు కలంకారి పెయింటిగ్స్‌కు ప్రఖ్యాతమైనవని, తదనుగుణంగా కలంకారి చీరలు, వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ స్టేషన్‌ను ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి అదనంగా ఈ ప్రాంతంలో రూపొందించిన వుడ్ క్రాఫ్టింగ్ వంటి ఇతర బహుళ ఉత్పత్తుల ప్రదర్శనకు, అమ్మకానికి కూడా అనుమతి ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.

స్టాల్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యాంశాలు

పైలెట్ ప్రాజెక్టుగా 15 రోజులకు నామమాత్రపు రిజిస్ట్రషన్ ఫీజు రూ.500లు చెల్లింపుతో స్టాల్స్‌ను కేటాయిస్తారు. పైలెట్ ప్రాజెక్టుకు రైల్వే వారిచే తాత్కాలిక పద్ధతిన ఈ స్టాల్‌ను ఏర్పాటు చేస్తారు. స్టాల్స్‌కు తగిన నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా అందిస్తారు. స్టేషన్‌లో రైలు దిగే/ఎక్కే ప్రాంతాలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో స్టాల్/కియోస్క్ ఏర్పాటు చేస్తారు.
ప్రధాన రైళ్ల / మార్గాల రైళ్ల వద్ద ప్రయాణికులకు ఉత్పత్తులను అమ్మే విధంగా అనుమతులను ఇస్తారు. స్టేషన్ సూపరింటెండెంట్ స్టేషన్‌లోకి ప్రవేశానికి (విక్రయదారులకు గుర్తింపు కార్డు) అనుమతి ఇస్తారు. అందులో అధీకృత విక్రయదారుడి పేరు, ఉత్పత్తి పేరు, కేటాయించిన రోజులు స్పష్టంగా ఇవ్వబడుతాయి. దీంతో అనధికారికంగా విక్రయాలను అరికట్టవచ్చు. ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ పథకం అని స్పష్టంగా తెలియజేసేలా ఈ స్టాల్స్ అధీకృత విక్రయదారులకు బ్యాడ్జీ ఇస్తారు. స్టాల్స్ కేటాయించిన వారు ప్లాట్‌ఫాంతో పాటు తదుపరి స్టేషన్ వచ్చే వరకు రైళ్లలో కూడా అమ్ముకోవచ్చు. డిజిటల్ ఇండియా లక్ష్యంలో భాగంగా డిజిటల్ విధానంలో చెల్లింపులు ప్రోత్సాహించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

స్టాల్స్ కేటాయింపులు ఇలా…

స్థానికంగా ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ( ఎస్‌హెచ్‌జి), ఎన్‌జీఓలు, కో ఆపరేటివ్ డీలింగ్స్ సహకారంతో గుర్తింపు పొందిన ఉత్పత్తుల కళాకారులను / కుమ్మరులను /హస్తకళాకారులను/ చేనేత మహిళలను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు గుంతకల్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ వారికి వారు ఉత్పత్తుల వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే బహిరంగ లాటరీ / బహిరంగ డ్రా విధానం ద్వారా మాత్రమే కేటాయిస్తారు.

ఈ బడ్జెట్‌లో ప్రోత్సాహాం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (2022, 23) సందర్భంగా ‘వన్ స్టేషన్ వన్ ప్రొడెక్ట్’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వేస్ట్టేషన్‌ను ఒక హబ్‌గా ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, కుమ్మరులకు, చేనేత/వస్త్ర కళాకారులకు, గిరిజనుల జీవనోపాధి వారి సంక్షేమాన్ని మెరుగుపరిచి స్థానిక పరిశ్రమను బలోపేతం చేకూర్చాలన్నదే ఈ విధానం ప్రధాన లక్ష్యం. స్థానిక ఉత్పత్తుల అమ్మకానికి ఒక మార్కెటింగ్ వ్యవస్థగా ఉండేందుకు స్టేషన్‌లో స్టాల్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News