భారీ ఆశలతో టీమిండియా n నేటి నుంచి రెండో టెస్టు
క్రిస్ట్చర్చ్: తొలి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు ఇప్పటికే ఓ మ్యాచ్ నెగ్గిన ఆతిథ్య న్యూజిలాండ్ క్లీన్స్వీప్ దృష్టి సారించింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను వైట్వాష్ చేయాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో న్యూజిలాండ్ సమతూకంగా కనిపిస్తోంది. మొదటి టెస్టులో బౌలర్లు అసాధారణ రీతిలో రాణించారు. ముఖ్యంగా సీనియర్లు టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్లు అద్భుత బౌలింగ్తో జట్టుకు అండగా నిలిచారు. తాజాగా ఈ మ్యాచ్లో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ చేరడంతో బౌలింగ్ మరింత బలోపేతంగా మారింది. ఇటీవల న్యూజిలాండ్ సాధించిన విజయాల్లో వాగ్నర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
గాయం వల్ల అతను తొలి టెస్టు మ్యాచ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈసారి తుది జట్టులో అతనికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్లో బాగానే ఉన్నా కివీస్ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి మ్యాచ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా అతనిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక సీనియర్ ఆటగాడు రాస్ టెలర్ కూడా జట్టుకు చాలా కీలకంగా మారాడు. అద్భుత ఫామ్లో ఉన్న టెలర్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఈ ఇద్దరు జట్టుకు చాలా కీలకంగా తయారయ్యారు. టామ్ లాథమ్, బ్లుండెల్, నికోల్స్, గ్రాండోమ్, వాట్లింగ్, జేమిసన్, సౌథి తదితరులు కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక సౌథి, బౌల్ట్, జేమిసన్, వాగ్నర్, పటేల్ తదితరులతో బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా తయారైంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా భారత్కు ఇబ్బందులు తప్పక పోవచ్చు.
గెలిస్తేనే
ఇక, ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవోగా తయారైంది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో గెలవడం తప్ప మరో మార్గం లేదు. మ్యాచ్ డ్రాగా ముగిసినా సిరీస్ను కోల్పోక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లిపై నెలకొంది. ఇందులో అతను ఎంత వరకు సఫలమవుతాడనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లి న్యూజిలాండ్ సిరీస్లో మాత్రం వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్లో బ్యాట్ను ఝులిపించాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు. ఇక, ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్లు కూడా శుభారంభం అందించేందుకు సిద్ధమయ్యారు. సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు కూడా విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం భారత్కు కష్టం కాక పోవచ్చు.
బౌలింగ్లో ఇషాంత్ గాయంతో జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి. తొలి మ్యాచ్లో ఇషాంత్ ఒక్కడే మెరుగైన బౌలింగ్ను కనబరిచాడు. ఈ మ్యాచ్లో అతని సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇది నిజంగా జట్టును కలవర పరిచే అంశమే. అయితే ఉమేశ్ యాదవ్ రూపంలో భారత్కు మంచి ప్రత్యామ్నాయం ఉండడం కాస్త ఊరట కలిగిస్తోంది. కానీ, సీనియర్ బౌలర్ బుమ్రా కొంత కాలంగా ఘోరంగా విఫలమవుతున్నాడు. అతను ఈ మ్యాచ్లోనైనా రాణిస్తాడా లేదా అనేది సందేహమే. షమి, అశ్విన్లు కూడా మెరుగైన బౌలింగ్ను కనబరచ తప్పదు. ఇలా, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే టీమిండియాకు సిరీస్ సమం చేసే అవకాశాలుంటాయి. లేకుంటే మరో ఘోర పరాజయం తప్పక పోవచ్చు.