స్పెయిన్పై భారత్ ఘన విజయం
హాకీలో ఆశలు సజీవం
టోక్యో: కిందటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం స్పెయిన్తో జరిగిన కీలక పోరులో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పతక ఆశలు సజీవంగా నిలిచాయి. కచ్చితంగా గెలవాల్సిన పోరులో మన్ప్రీత్ సింగ్ సేన 30 తేడాతో స్పెయిన్ను చిత్తు చేసింది. పూల్ఎలో భాగంగా జరిగిన మ్యాచ్లో ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి జట్టు రక్షణ శ్రేణి ఛేదించుకుంటూ గోల్ దిశగా అడుగులు వేసింది. ఎటాకింగ్తో అలరించిన భారత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. అసాధారణ ఆటతో స్పెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో సిమ్రన్జిత్ సింగ్ 14వ నిమిషంలో భారత్కు తొలి గోల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాతి నిమిషంలో స్టార్ ఆటగాడు రూపిందర్పాల్ సింగ్ గోల్ చేసి స్కోరును 20కు పెంచాడు. ఆ తర్వాత భారత్ డిఫెన్స్కే పరిమితమైంది. మరోవైపు స్పెయిన్ పదేపదే దాడులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
భారత ఆటగాళ్లు, గోల్ కీపర్ అద్భుత ఆటతో ప్రత్యర్థి జట్టు దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. ప్రథమార్ధంలో భారత్ రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్లో కూడా పోరు ఆసక్తికంగా సాగింది. ఇటు స్పెయిన్ అటు భారత్ దూకుడును ప్రదర్శించాయి. దీంతో మ్యాచ్లో హోరాహోరీ తప్పలేదు. అయితే స్పెయిన్ తీవ్ర పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక 51వ నిమిషంలో భారత్ మూడో గోల్ను నమోదు చేసింది. ఈ గోల్ను కూడా రూపిందర్పాల్ సింగ్ సాధించాడు. దీన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్ 30 తేడాతో ఘన విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్లో 32 తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. అయితే వరల్డ్ నంబర్వన్ ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో మాత్రం 17 తేడాతో ఘోర పరాజయం పాలైంది. కానీ అనూహ్యంగా పుంజుకున్న భారత్ పటిష్టమైన స్పెయిన్ను చిత్తు చేసి మళ్లీ గాడిలో పడింది. తర్వాతి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. గురువారం ఈ మ్యాచ్ జరుగుతుంది.