పోక్సో కోర్టు తీర్పు, టెక్నీషియన్ను నిర్దోషిగా ప్రకటన
ముంబై : ఎటువంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ పిల్లల చెంపను తాకడం నేరం కాదని పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బుగ్గలు గిల్లి 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న 28 ఏళ్ల ఓ టెక్నీషియన్ను గత మంగళవారం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఫ్రిజ్ పనిచేయడం లేదనే ఫిర్యాదు మేరకు నిందితుడు 2017లో బాధితురాలి ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి ఫ్రిజ్ని చెక్ చేసి, అవసరమైన స్పేర్ పార్ట్ తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న ఐదేళ్ల చిన్నారి బుగ్గలు గిల్లాడు. దీన్ని అభ్యంతరకరంగా భావించిన తల్లి అతడిని వారించి కిచెన్లోకి వెళ్లింది. ఇక ఆమె వంట గదిలో పనిలో ఉండగా టెక్నిషియన్ వెనక నుంచి వెళ్లి కౌగిలించుకున్నాడు.
సదరు మహిళ అతడిని పక్కకు తోసి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అతడు వదలలేదు. దాంతో ఆమె ఇరుగుపొరుగును పిలిచినా లాభం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సదరు టెక్నిషియన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు టెక్నిషియన్పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు అతడికి లైంగిక వేధింపుల నేరం కింద ఏడాది జైలు శిక్ష విధించింది. కొద్ది రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే చిన్నారిపై లైంగిక వేధింపులు ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. దురుద్దేశం లేకుండా చిన్నారి బుగ్గలు గిల్లడం నేరం కాదని వెల్లడించింది. దానికి సహేతుకమైన అనుమానాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పై ఉందని పేర్కొంది. ఇక చిన్నారి తల్లి సాక్ష్యాలను పరిశీలిస్తే, నిందితుడి బహిరంగ చర్యలు బాధితురాలిపై లైంగిక వేధింపులు, ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని నిరూపించలేకపోతున్నాయి అని కోర్టు అభిప్రాయపడింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది.