25లోపు పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తి
సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటు
జిహెచ్ఎంసి ఎన్నికల అధికారులతో నిర్వహించిన
టెలి కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల సిబ్బందికి ఈ నెల 24 నుండి 27 వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి తెలిపారు. ఈ నెల 25వ తేదీలోపు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తవుతుందని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల కోసం నియమితులైన సాధారణ పరిశీలకులు, జిహెచ్ఎంసి ఎన్నికల అధికారులు, కమిషనర్, జోనల్ కమిషనర్లతో సోమవారం ఆయన తన కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఇసి సి.పార్థసారధి మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ సోమవారం పూర్తవుతుందని,మంగళవారం సర్వీస్ ఓటర్లకు పంపిస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఈ నెల 25లోపు పూర్తవుతుందన్నారు.
ఈ నెల 24, 25 ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహిస్తామని, వెబ్ క్యాస్టింగ్ వాలంటీర్లకు ఈ నెల 27న, మైక్రో అబ్జర్వర్లకు ఈ నెల 28న శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు ఎన్నికల నిర్వహణ సందర్బంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్సు టీంలను పెంచాలని, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నా రు. స్ట్రాంగ్ రూంల కిటికీలను ఇటుకల గోడతో కానీ, చెక్కలతో కానీ మూయాలని, రెండు కౌంటింగ్ హాళ్లలో కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో అవసరమైన చోట అదనపు రిటర్నింగ్ అధికారిని నియమించాలని చెప్పారు. రౌడీ షీటర్లను, సమస్యలు సౄష్టించే వారిని ఐపిసి, సిఆర్పిసి కింద బైండోవర్ చేస్తూ అవసరమైన చోట నిర్బంధించాలని ఎస్ఇసి అన్నారు.