న్యూఢిల్లీ : లాక్డౌన్ పొడిగింపు వల్ల… ఇప్పుడు అమల్లో ఉన్న ప్రయాణికుల రైళ్ల రద్దును మే 3వ తేదీవరకు కొనసాగించాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి టిక్కెట్ల సొమ్ము పూర్తిగా వాపసిస్తామని, ఇది ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా జరుగుతుందని ప్రకటించింది. కౌంటర్లలో బుక్ చేసుకున్నవారు మాత్రం జూలై 31 వరకు సొమ్ముకోసం క్లైమ్ చేసుకోవచ్చని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ చేయించుకొని, రద్దు చేసుకోని వారు కూడా టిక్కెట్లు కేన్సిల్ చేసుకుంటే పూర్తి మొత్తాన్ని పొందుతారు. ఇక దేశంలో వివిధ ప్రాంతాలకు సరకు రవాణా చేస్తున్న గూడ్స్ రైళ్లు మాత్రం రాకపోకలు సాగిస్తాయి. నిత్యావసరాలు చేరవేస్తున్నందువల్ల వాటికి మినహాయింపు ఇచ్చారు. రైలు ప్రయాణానికి టిక్కెట్లు తీసుకునేందుకు స్టేషన్ లోపల లేదా బయట మే 3 అర్ధరాత్రి వరకు బుకింగ్ కౌంటర్లు పనిచేయవని రైల్వే తెలిపింది. ఈ మేరకు జోన్లకు రైల్వే బోర్డు నిబంధనావళి పంపింది.