Thursday, April 18, 2024

లింగమార్పిడి చేయించుకున్న మగాడు బిడ్డను కనలేడు: మునీర్

- Advertisement -
- Advertisement -

కొజికోడ్(కేరళ): కేరళలో లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు(జియా పావల్, జహ్హద్) బిడ్డను కనడంపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) నాయకుడు ఎం.కె. మునీర్ ఆక్షేపణ తెలిపారు. దాని వెనుక ఏమి లాజిక్ ఉందన్నారు. వారు ‘మూర్ఖుల స్వర్గం’లో నివసిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా లింగమార్పిడి చేయించుకున్న దంపతులు జియా పావల్, జహ్హద్ గత వారం కేరళలో బిడ్డను కన్నారు. కాగా దీనిపై కేరళలోని ట్రాన్స్‌జెండర్ల సమూహం వేడుకలు చేసుకున్నది. కానీ మునీర్ మాత్రం ‘హోమోసెక్సువల్’ దంపతులు బిడ్డను కనడం ‘బోలు’(హాలో) అని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇదే తొలి ట్రాన్స్‌జెండర్ ప్రసూతి అని జియా పావల్ ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి 8న ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి బిడ్డ జన్మించింది.

విజడమ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మస్లింలీగ్ నాయకుడు మునీర్ ప్రసంగిస్తూ ‘ఇలాంటి అద్భుతాలను నమ్మేవారు మూర్ఖుల స్వర్గంలో నివసిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి బిడ్డను కన్న ఆ పురుషుడు జన్మతః మహిళ అని, తర్వాత లింగమార్పిడి చేయించుకోవడం జరిగిందని, తన వక్షోజాలను కూడా తొలగించిందని మునీర్ పేర్కొన్నారు. ‘బిడ్డను కన్న పురుషుడికి గర్భసంచి ఉండడమంటే వాస్తవానికి అతడు మహిళే’ అని కొడువల్లి ఎంఎల్‌ఏ పేర్కొన్నారు. ఆయన ఇంకా అండంతో వీర్యం కలిసినప్పుడే గర్భం ఏర్పడుతుందని కూడా చెప్పారు.

ఆ ట్రాన్స్‌జెండర్ దంపతులు తమకు పుట్టిన శిశువు బర్త్ సర్టిఫికేట్‌ను, ఇతర డాక్యుమెంట్లను నమోదుచేసుకున్నాక మునీర్ ఈ ప్రకటన చేశారు. కాగా బిడ్డకు జన్మనిచ్చిన జహ్హద్ ఆ బిడ్డకు తండ్రిగా, అతడి భాగస్వామి పావల్‌ను తల్లిగా రిజిష్టర్ చేయించారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 కింద ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాము లింగమార్పిడి చేయించుకునే హక్కును కలిగి ఉన్నట్లు ఆ ట్రాన్స్‌జెండర్ దంపతులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తనకు ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కార్డు ఇచ్చినందున ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండబోవని పావల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News