గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు శనివారం ట్రయల్ రన్తో రైలు వచ్చేసింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సిఎం కెసిఆర్ చొరవతో సాకారమైంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రయాణికులతో బ్రాహ్మణపల్లి- – గజ్వేల్ మధ్య రైలు పరుగులు తీయనుంది. మనోహరాబాద్ -కొత్తపల్లి మార్గంలో రైలు కల సాకారం అవుతున్న దశలో ఇప్పటి వరకు రైల్వే ట్రాక్ పూర్తయిన మార్గంలో ట్రయల్ రన్ను రైల్వే శాఖ నిర్వహించింది. శుక్రవారం బ్రాహ్మణ పల్లి నుంచి నాచారం వరకు 12కిలోమీటర్లు ట్రయల్ రన్ చేయగా, శనివారం బ్రాహ్మణ పల్లి నుంచి అదనంగా మరో21 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ స్టేషన్ వరకు ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేశారు.
శనివారం సాయంత్రం రైలింజన్తో నిర్వహించిన ఈ ట్రయల్ రన్ కార్యక్రమానికి మెదక్ రైల్వే బోర్డు సభ్యుడు రేకుల లకా్ష్మరెడ్డి హాజరయ్యారు. ఆయన రైల్వే సిబ్బందితో ట్రయల్ రన్కు సంబంధించిన వివరాలను వాకబు చేశారు. రైల్వే ట్రాక్ పూర్తయిన బ్రాహ్మణ పల్లి – గజ్వేల్ మధ్య ఇలాంటి ట్రయల్ రన్స్ ఇంకా కొద్దిరోజులు కొనసాగుతాయని, అన్ని సాంకేతిక లోపాలను సరి చేసుకుని మార్చినెలాఖరుకల్లా పూర్తి స్థాయిలో ప్రయాణికులతో రైలు నడపటానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారని రైల్వే బోర్డు సభ్యుడు లకా్ష్మరెడ్డి తెలిపారు. స్టేషన్లో ఉన్న రైలింజన్ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సిఎం కెసిఆర్ సహా మంత్రి హరీష్ రావు తదితరులు ఈ మార్గంలో రైలు మార్చి నెలలో కూతపెడుతుందని పలు సందర్భాల్లో చెప్పినట్లే ప్రాజెక్టు క్రియాశీలకంగా కార్యరూపం దాల్చటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trial Run Success on Manoharabad Gajwel Track