Tuesday, April 23, 2024

‘రణ’గోడు

- Advertisement -
- Advertisement -

పలివెలలో టిఆర్‌ఎస్,బిజెపి
కార్యకర్తల మధ్య ఘర్షణ
పరస్పరం రాళ్లు, కర్రలతో
ఇరువర్గాల దాడులు
12 వాహనాలు ధ్వంసం
ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి,
ఎంఎల్‌ఎ పెద్దిసుదర్శన్‌రెడ్డి,
జడ్‌పి చైర్మన్ జగదీశ్ సహా
20మందికి గాయాలు
దాడులతో భద్రత పెంచిన ఇసి

ప్రచారం చివరి రోజు మహోద్రిక్తంగా మునుగోడు

మునుగోడు రణగోడుగా మారింది.ఉప ఎన్నిక ప్రచార ఘట్టం ఆఖరి రోజు బిజెపి, టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ నియోజకవర్గంలో మహోద్రిక్త పరిస్థితులను సృష్టించింది. పలువురు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులతో సహా దాదాపు 20మంది గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరుపక్షాలను అదుపు చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘర్షణను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం గట్టి భద్రత చర్యలను చేపట్టింది. రేపటి పోలింగ్‌కు సర్వంసిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై 48గంటల పాటు నిషేధం విధించినట్లు అధికారులు తెలియజేశారు.

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరి కొద్ది క్షణాల్లో ముగియనున్న వేళ… నియోజకవర్గంలో హింస చెలరేగింది. టిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారి తీసింది. ఉప ఎన్నిక పోరును ఇది మహోద్రిక్తంగా మార్చేసింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మునుగోడులో మంత్రి కెటిఆర్ రోడ్ షో నేపథ్యంలో పలివెల గ్రామంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అయితే ఆ ర్యాలీ బిజె పి నేతల క్యాంప్ ఉన్న దిశగా సాగింది. కమలనాథుల క్యాంప్ వద్ద ర్యాలీకి బిజెపి నేతలు అడ్డంగా ఉండటంతో ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం మొదలైంది. అది తీవ్రమై బిజెపి టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు చేసుకున్న పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ కారుపై రాళ్లు పడటంతో కారు స్వల్పంగా దెబ్బతింది. వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎవ రూ తగ్గలేదు. ముందుగా బిజెపి కార్యకర్తలు టిఆర్‌ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడంతో, టిఆర్‌ఎస్ కా ర్యకర్తలు రాళ్ల దాడి చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ పరిస్థితి భీతావహంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు కార్యకర్తల కాళ్లపై పడ్డాయి. ఈ దాడిలో బిజెపి ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీశ్ సహా పలువురికి గాయాలయ్యాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెవికి తీవ్ర గాయమైంది.

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల శ్రేణులు రణరంగం సృష్టించా రు. కర్రలతో దాడులు చేసుకుని పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు. ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసు లు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. తాజా ఘటనపై ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తప్పంతా టిఆర్‌ఎస్ దేనని బిజెపి ఆరోపిస్తుండగా, బిజెపినే రెచ్చగొట్టిందని టిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. పలివెల గ్రామంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలపై బిజెపి శ్రేణు ల దాడుల విషయమై మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి,పోలీసు అధికారులకు టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఘర్షణపై పరస్పర ఆరోపణలు

టిఆర్‌ఎస్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడితో అక్కడ పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ఘటన తర్వాత పోలీసులు భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఈ అంశంపై తప్పు మీ దంటే మీదని రెండు రాజకీయ పార్టీల నేతలు ఆరోపణ లు చేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్ నేతలే.. తమ పైకి వచ్చిరెచ్చగొట్టారని.. దాడులు చేశారని.. పోలీసులు నిర్లక్ష్యం గా వ్యవహరించారని.. ఈటల రాజేందర్ ఆరోపించారు. పోలీసులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారని మండిపడ్డారు. మరో వైపు టిఆర్‌ఎస్ నేతలు.. మాత్రం తమను బిజెపినే రెచ్చగొట్టిందని విమర్శలు గుప్పించారు. పరస్పరం రాళ్ల దాడి జరిగిందని బిజెపి కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

దాడుల ఘటనలతో మరింత భద్రత పెంచిన ఈసీ

మరో వైపు ప్రచారం చివరి రోజున తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటంతో.. ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. వెంటనే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. సాయంత్రం ఆరు గంటలకు.. మునుగోడులో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఆ తర్వతా నియోజకవర్గంలో.. ఇతరులు ఎవరూ ఉండకూడదని ఈసీ ప్రకటించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచారు. దాడులు, దౌర్జన్యాలు, రాజకీయ పార్టీల కార్యకర్తల ఘర్షణలను సీరియస్‌గా తీసుకోవాలని సిబ్బందికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

పోలింగ్ రోజున మరింత టెన్షన్

మునుగోడు ఉపఎన్నికను టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ సీ రియస్‌గా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య కొన్ని రోజుల నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. కాంగ్రె స్ పార్టీకి చెందిన కార్యాలయాలు, వాహనాలపైనా దా డులు జరిగాయి. తాజాగా టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య జ రిగిన ఘర్షణతో రేపటి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. రాజకీయ పార్టీలు సహనం కోల్పోతున్నాయ ని.. పోలింగ్ రోజున మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈసీ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News