పునాదుల నిర్మాణంపై నిపుణులతో చర్చలు
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పునాదులు నిర్మించే కార్యక్రమంపై భవన నిర్మాణ నిపుణులతో రామ మందిర నిర్మాణ కమిటీ చర్చలు జరుపుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు తెలిపింది. రామ మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన మంగళవారం రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది. లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్కు చెందిన నిపుణులతో ఆలయ కమిటీ సభ్యులు చర్చలు జరిపారని, ఆలయ నిర్మాణ ఆకృతులు, పునాదుల నిర్మాణం తదితర అంశాలపై చర్చలు జరిపారని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. రామ జన్మభూమి ఆలయం కోసం పునాదులు నిర్మించే ప్లాన్ను కమిటీ సభ్యులు ఖరారు చేస్తున్నారని ఆయన చెప్పారు.
చర్చలలో భాగంగా ఆలయ నిర్మాణం జరగనున్న ప్రదేశాన్ని నిపుణులతో కలసి నృపేంద్ర మిశ్రా సందర్శించారు. నిర్మాణ ప్రదేశంలోని భూమి లోపల కొద్ది అడుగులలో ఇసుక ఉండడాన్ని ట్రస్టు సభ్యులు గుర్తించారు. అయితే భూమి లోపల ఇసుక ఉండడం వింతేమీ కాదని డాక్టర్ మిశ్రా చెప్పారు. నది ఒడ్డున ఉన్న అయోధ్యలో భూమి లోపల ఇసుక లేదా ఇసుకతో కూడిన మట్టి ఉండడం అసహజమేమీ కాదని ఆయన ఆయన అన్నారు. కాగా..దీని వల్ల ఆలయ నిర్మాణానికి అవరోధాలు ఏర్పడగలవన్న అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. ఆగ్రాలో తాజ్మహల్ కూడా యమునా నది ఒడ్డున నిర్మించారని ఆయన గుర్తు చేశారు. భూమి లోపల ఇసుక ఉన్న ప్రదేశంలోనే తాజ్ మహల్ నిర్మాణం జరిగిందని, ఎన్నో శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ కట్టడం చెక్కుచెదరలేదని ఆయన చెప్పారు. వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా రామాలయ నిర్మాణ పునాదులు ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. రామ మందిరానికి పునాదులు వేసే ప్రదేశంలో భూసార పరీక్షలను ఐఐటి-మద్రాసు నిర్వహిస్తోంది. కాగా..ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిల్పాలను కరసేవకపురం వర్క్షాప్ నుంచి ఆలయ ప్రాంగణానికి చేరవేసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది.