పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
ఫలించిన మంత్రి పువ్వాడ కృషి.. రూ.36 కోట్లతో 55 వేల ఎస్ఎఫ్టి
త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్షంతో తెలంగాణ ప్రభుత్వం ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లాకు ఐటి హబ్లో టవర్2 నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పరిపాలనా ఉత్తర్వులు మంజూరు చేసింది. రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగులతో ప్రత్యక్షంగా 570 మంది ఒకే సారి పని చేసుకునే వెసులుబాటుతో విశాలమైన సదుపాయం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద గల ప్రస్తుత ఐటీ హబ్1 ఇప్పటికే ప్రారంభించి తమ సేవలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషి మేరకు మంగళవారం ఐటి టవర్2కు పరిపాలనా అనుమతులు రావడంతో జిల్లా యువతలో మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు ఖమ్మం గుమ్మంలో అందుబాటులోకి రానున్నాయి. అతి త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేయనున్నారు.