మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 63 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందుతున్నాయని నివేదించింది. గతంలో 42 ఆస్పత్రులు ఉండగా తాజాగా 21 దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కరోనా పరీక్షలు, చికిత్సలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు తదితర అంశాలపై దాఖలైన 24 ప్రజా ప్రయోజనాలను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే సరిగ్గా విచారణ ప్రారంభమయ్యే ముందు నివేదిక ఇస్తే ఎలా పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈనెల 12న విచారణ చేపడతామని తాజా నివేదికలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
రైతుల బీమాపై: రైతులు బీమా ప్రీమియం చెల్లించినా పంట నష్టపరిహారం చెల్లించడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆదిలాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త పాయల్ శంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రెండేళ్లుగా రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు ప్రీమియం చెల్లిస్తున్నా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పంటల బీమా పథకం కింద నష్ట పరిహారం చెల్లించట్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది.
TS Govt Submits report to HC on corona conditions