Friday, April 19, 2024

ఒడిశాకు టిఎస్ ఆర్‌టిసి బస్సు సర్వీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్‌టిసి) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య సరస్పర బస్ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ ఆర్‌టిసి)తో టిఎస్ ఆర్‌టిసి ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టిఎస్ ఆర్‌టిసి ఛైర్మెన్, ఎంఎల్‌ఏ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో సంస్థ ఎండి విసి సజ్జనార్, ఓఎస్ ఆర్‌టిసి ఎండి దీప్తేష్ కుమార్ పట్నాయక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం…టిఎస్ ఆర్‌టిసి 10 బస్సులను ఒడిశాకు, ఓఎస్ ఆర్‌టిసి 13 సర్వీసులను తెలంగాణకు నడపనుంది. కాగా హైదరాబాద్ జైపూర్ 2, ఖమ్మం రాయగడ్ 2, భవానిపట్న విజయవాడ ( వయా భద్రాచలం ) 2, భద్రాచలం జైపూర్ 4 బస్సు సర్వీసులను టిఎస్ ఆర్‌టిసి నడపనుంది.

నవరంగ్ పూర్ హైదరాబాద్ 4, జైపూర్ హైదరాబాద్ 2, భవానిపట్న విజయవాడ ( వయా భద్రాచలం) 2, రాయఘడ్ కరీంనగర్ 2, జైపూర్ భద్రాచలం 3 బస్సులను ఓఎస్ ఆర్‌టిసి తిప్పనుంది. తెలంగాణ ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాక పోకలు సాగిస్తుంటారని , ఈ డిమాండ్ నేపథ్యంలో ఓఎస్ ఆర్‌టిసితో అంతర్రాష్ట ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు టిఎస్ ఆర్‌టిసి ఛైర్మెన్, ఎంఎల్‌ఏ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని , ఆయా మార్గాల్లో 10 బస్సులతో ఒడిశాలో 3378 కిలోమీటర్ల మేర నడపాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు. టిఎస్ ఆర్‌టిసి తీసుకువ చ్చిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓఎస్ ఆర్‌టిసి ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టిఎస్ ఆర్‌టిసి ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్బుతంగా ఉన్నాయని ఓఎస్ ఆర్‌టిసి ఎండి దీప్తేష్ కుమార్ పట్నాయక్ ప్రశంసించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్సు సర్వీసులతో తెలంగాణలో 2896 కిలో మీటర్ల మేర నడుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఆర్‌టిసి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వి. రవీందర్ , జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సిపిఎం కృష్ణకాంత్ , సిటిఎం జీవ ప్రసాద్, సిఎంఈ రఘనాథరావు, ఐటి చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్, సిటిఎం (ఎం. అండ్ సీ) విజయ్ కుమార్, బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) సంతోష్ కుమార్, చీఫ్ మేనేజర్ ( ఫైనాన్స్) విజయపుష్పతో పాటు ఓఎస్ ఆర్‌టిసి ఓఎస్‌డి దీప్తి మహాపాత్రో, ట్రాన్స్‌పోర్ట్ ప్లానర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News