హైదరాబాద్: ఈనెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా పాఠాలు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి పాఠశాలలకు 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు నిబంధనలు, టైమ్ లిమిట్ వంటి ఆంక్షలు విధించారు. ఈనెల 31న తెలంగాణ ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఇంటర్ ఆన్ లైన్ డిజిటల్ తరగతులు నిర్వహిస్తామని మంత్రి సబితా రెడ్డి వివరించారు.
TS Schools Digital classes to begin from Aug 20