Friday, April 19, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. ఛార్జ్‌షీట్ లో 37 మంది పేర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. నిందితులపై అభియోగపత్రం(ఛార్జ్‌షీట్)లో 37 మంది పేర్లు చేర్చనున్నట్లు సమాచారం. న్యాయ సలహా తీసుకొని వచ్చే వారంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది నిందితులు బెయిల్ పై బయటకి వచ్చారు.

ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు జైల్లోనే ఉన్నారు. మరోవైపు డిఇ రమేష్ అరెస్టుతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితుడు డిఇ రమేష్ కొందరు అభ్యర్థులతో హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించాడు. డిఇ ప్రశ్నా పత్రాన్ని దాదాపు 80 మందికి విక్రయించినట్లు సిట్ అదికారుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

ఈ క్రమంలోనే నిందితుడు షాకింగ్ విషయాలు బహిర్గతం చేశాడు. డిఇ రమేష్ ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు కూడా ఎఇఇ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు వెల్లడైంది. అయితే విచారణలో ఎఇఇ సివిల్, జనరల్ నాలెడ్జ్, డిఎఒ పరీక్షల ప్రశ్నాపత్రాలను 40 మందికి ఇవ్వడంతో పాటు హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించినట్లు తేలింది. ఈ క్రమంలోనే డిఇ రమేష్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు నాంపల్లి కోర్టు అనుమతితో అతడిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. విచారణలో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ కూతురు రమేష్ ద్వారా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు తేలింది.

శ్రీనివాస్‌ను కలిసిన రమేష్ 75 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడి అయింది. ఈ క్రమంలోనే ఆ ఎంపిటిసి కూతురు పరీక్ష రాయగా ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా ఆమెకు రమేష్ జవా బులు చేర వేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎంపిటిసితో పాటు ఆయన కూతురును కూడా అధికారులు విచారించనున్నారు. ఇలా ఇప్పటి వరకు విచారణలో మొత్తం 80 మందికి డిఇ రమేష్ ప్రశ్నాపత్రాలు అమ్మినట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News