ఐటి చట్టాలు పాటించడంలో ట్వీట్టర్ విఫలం: కేంద్రం
అఫిడవిట్ సమర్పించిన కేంద్రం: నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: కొత్త ఐటి నిబంధనలను పాటించడంలో ట్వీట్టర్ విఫలమైందని కేంద్రం పేర్కొంది. ఈమేరకు దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనలు పాటించక పోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుందని, దీని ప్రకారం ట్వీట్టర్ మధ్యవర్తిత్వ హోదా కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది. నూతన చట్టం కింద మూడు నెలల్లో నిబంధనలకు కట్టుబడాల్సిందిగా గడువు ఇస్తూ ఫిబ్రవరి 25న నిబంధనలను నోటిఫై చేసినట్టు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. మే 26 నాటికి ఆ గడువు ముగిసినా, ట్వీట్టర్ నిబంధనలు పాటించలేదని తెలియచేసింది.
ట్వీట్టర్ తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని, తాత్కాలిక నోడల్ కాంటాక్ట్ అధికారిని నియమించగా, వారు వైదొలగడంతో అమెరికాకు చెందిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించిందని పేర్కొంది. భారతీయేతర వ్యక్తులను నియమించడమంటే ఐటి నిబంధనలు ఉల్లంఘించడం కిందకు వస్తుందని, కేంద్రం తెలియచేసింది. ఇదిలా ఉండగా ట్వీట్టర్ తాను దాఖలు చేసిన అఫిడవిట్లో తాత్కాలిక చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ను, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని, తెలిపింది. మంగళవారం ఈ అంశం విచారణకు రానున్నది.
Twitter failed to comply with New IT Rules: Centre