నిజాంపేట: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నింధితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఎసిపి సురేందర్రావు, బాచుపల్లి సిఐ నర్సింహారెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నిజాంపేట హనుమాన్ ఆలయం వద్ద బాచుపల్లి పోలీస్ సిబ్బంది, కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పందంగా తిరుగుతూ కనిపించారు. వారిని విచారించగా ఎల్లమ్మబండకు చెందిన రమగల్లు రాజు (24) , మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన తోగరి మహేందర్ (24) చేవెళ్ళలో నివాసం ఉంటున్నాడు.
ఈ ఇద్దరు కలిసి సైబరాబాద్ కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2020 నుంచి పలు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. బాచుపల్లిలో ఒకటి, నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకటి, బోల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో మూడు, అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు, పటాన్చెరువు పోలీస్స్టేషన్ పరిధిలో ఒకటి, నర్సాపూర్ టౌన్ నందు ఒకటి మొత్తం 11 మోటార్ సైకిళ్లను దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి 11 బైకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.