వెల్దుర్తి: చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక సర్పంచ్ మధు సూదన్ రెడ్డి, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ షాహేద బేగం, సమీయోద్దిన్ల కుమారులు మహ్మద్ అదీల్ రియాల్(14), మహ్మద్ ఆర్మాన్ తౌఫిక్(11)లు తాము ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో తోటి స్నేహితులతో ఆడుకుంటామని చెప్పి బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లారు. కాగా సాయంత్రం దాటిన చిన్నారులు ఇద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారి సహయంతో గ్రామంలో, గ్రామానికి ఆనుకొని ఉన్న జాతీయ రహదారి వెంట ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు. బుధవారం రాత్రి చిన్నారుల తల్లితండ్రులు చేగుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. చిన్నారులతో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులను విచారించగా మాసాయిపేట గ్రామ శివారులోని హల్దివాగుపై ఉన్న చెక్డ్యాంలో పడినట్లు వారు తెలిపారు. ఉన్న ఇద్దరు కుమారులు మృతిచెందడంతో చిన్నారుల తల్లితండ్రులు మృతదేహాలపై పడిబోరున విలపించగా గ్రామస్థులు కంటతడి పెట్టారు. చిన్నారులు అయిన అన్నదమ్ములు మృతి చెందడంతో మాసాయిపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తండ్రి సమీయోద్దిన్ ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.