హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్లకు ఆహ్వానం అందింది. బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో అఖిలభారత సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ షీ టీం ఇన్స్పెక్టర్ సునీత, వరంగల్ పోలీస్ కమిషనరేట్ వర్ధన్నపేట ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ లకు ఆహ్వానం లభించింది.
అంతర్జాతీయ సేఫ్ ఇంటర్నెట్ డే పురస్కరించుకొని న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పిల్లలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధం పై ఎంపిక చేసిన పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్ లను మాస్టారు, ట్రైనర్ల శిక్షణకుగాను డిజిపి కార్యాలయం ఎంపిక చేసి పంపించింది.
కాగా మహారాష్ట్ర, కేరళ చత్తీస్గ్గడ్, అస్సాం, ఒరిస్సా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాష్ట్రాల నుండి పోలీస్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణా నిచ్చారు. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో డైరెక్టర్ రాంపాల్ సన్యాల్, సైబర్ పీస్ ఫౌండేషన్ ప్రసిడెంట్ వినీత్ కుమార్, యూ.పి రిటైర్డ్ డిజిపి సుతాప్ సన్యాల్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి తమను ఎంపిక చేయడం పట్ల డిజిపి మహేందర్ రెడ్డి కి ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.