రూ.1.50లక్షలు తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్
రూ. 70వేలతో రెడ్హ్యాండెడ్గాపట్టుబడిన ఎఇ
అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన అధికారులు
మున్సిపల్ కమిషనర్కు సహకరించిన బిల్డింగ్ ప్లానర్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓ బిల్డింగ్ పనులను నిలిపివేయకుండా ఉండేందుకు రూ. 1.50లక్షలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ రవిందర్ రావు, ట్రన్స్ఫార్మర్ అనుమతి కోసం రూ. 70 వేలు తీసుకున్న నిజామాబాద్ ఎఇ కాంతారావులను మంగళవారం నాడు ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ అరవింద్కు లంచం వ్యవహారంలో సహకరించడంతో పాటు మధ్యవర్తిగా ఉన్న బిల్డింగ్ ప్లానర్ గుంటుపల్లి ఆదినారాయణ నుంచి రూ. 50 వేలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా రామగుండంలో ట్రాన్స్ఫార్మర్ అనుమతి కోసం రాజేశ్వరరావు నిజామాబాద్ జిల్లా విద్యుత్శాఖ ఎఇ కాంతారావును సంప్రదించాడు. దీంతో తనకు రూ. 70 వేల లంచంగా ఇవ్వాలని ఎఇ డిమాండ చేయడంతో రాజేశ్వరావు నేరుగా ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఎఇ కాంతారావు నారాయణగూడాలోని తన ఇంటి వద్ద మంగళవారం ఉదయం రూ. 70 వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం ఎఇ లంచం తీసుకున్న చేతివేళ్లకు ఎసిబి అధికారులు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ఎఇకి సంబంధించిన లింగపల్లి, కాచిగూడా తదితర ప్రాంతాలలో ఎఇ నివాసాలలో సోదాలు చేపట్టారు. కాగా లంచం తీసుకున్న కేసులో ఎఇ కాంతారావును అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరచగా అతనికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అదేవిధంగా పెద్దఅంబర్ పేట పరిధిలోని కొత్తూరు గ్రామంలో గృహ నిర్మాణ పనులను నిలిపివేయకుండా ఉండేందుకు సురభి వెంకటరెడ్డిని మున్సిపల్ కమిషనర్ అరవింద్రావు రూ. 2 లక్షలు డిమాండ్ చేయడంతో బాదితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలో హయత్నగర్కు చెందిన ఆదివెంకట అసోసియేట్స్లో ప్లానర్గా పనిచేస్తున్న గుంటుపల్లి ఆదినారాయణరావు లంచంలో రూ. 50వేలు వాటా ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ ఒప్పందం చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన ఎసిబి అధికారులు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ రవిందర్ రావు మంగళవారం నాడు తన కార్యాలయంలోని ఛాంబర్లో రూ. 1.50 లక్షలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్, అతనికి సహకరించిన గుంటుపల్లి ఆదినారాయణలపై అవినీతి, లంచం కేసులను నమోదు చేసిన ఎసిబి అధికారులు ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారిద్దరికీ కోర్టు రిమండ్ విధించింది. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమేనని, అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు పడేంతవరకు విశ్రమించే ప్రసక్తిలేదని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు.