కృష్ణా, తుంగభద్ర నదులకు పెరుగుతున్న వరద
ఉదయానికి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం
మన తెలంగాణ/నాగర్ కర్నూల్: కృష్ణానదికి క్రమక్రమంగా వరద పెరుగుతుండడంతో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు రెండుగేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు 56 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ జూరాల ప్రాజెక్టు నుంచి 86 వేల క్యూసెక్కుల నీరు స్పిల్ వై ద్వారా వదులుతున్నారు. అదేవిధంగా మరో 40 వేల క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా వదులుతున్నారు. అదేవిధంగా తుంగభద్రా నదికి వరద పెరగడంతో దుంకేసుల ప్రాజెక్ట్ ద్వారా 76 వేల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలం కు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు లక్షల 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 212 టిఎంసిల నీరు నిల్వ ఉంది 885 అడుగులకు గాను 884 . 40 అడుగులుగా నమోదయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరో మూడు రోజుల పాటు ఇదే తరహాలో వరద ప్రవాహం కొనసాగే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.