కర్నాటకకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్లేస్టోర్లో నకిలీ యాప్లు
యాప్ లేదు… డౌన్లోడ్ చేసుకోవద్దు: పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ధరణీ నకిలీ యాప్ను రూపొందించిన ఇద్దరు యువకులను నగర సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం, బీదర్ జిల్లా, బసవకళ్యాణంకు చెందిన ప్రేమ్ములే స్టేషనరీ షాపును నడుపుతున్నాడు. బీదర్కు చెందిన మహేష్కుమార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్సైట్కు అనుసంధానంగా అని చెప్పి ధరణి మొబైల్ యాప్ను రూపొందించారు. దానిని గూగుల్ ప్లేసోర్లో పెట్టారు.
దీంతో చాలామంది ఈ యాప్ నిజమైనదని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది తెలుగులోనే ఉండడంతో చాలామంది నమ్మి డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ లిమిటెడ్కు తెలియడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఈ నెల 23వ తేదీన ఫిర్యాదు చేశారు. అలాగే ధరణి పేరుతో ఐదుకు మించిన మొబైల్ యాప్లు గూగుల్ ప్లేస్టోర్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఫిర్యాదు చేశారు. ధరణికి ఎలాంటి మొబైల్ యాప్లేదని నకలీ యాప్లను నమ్మి డౌన్లోడ్ చేసుకోవద్దని పోలీసులు కోరారు. కేసు దర్యాప్తు చేసిన ఇన్స్స్పెక్టర్ భద్రంరాజు రమేష్, ఎస్సౌ వెంకటేశం, పిసిలు మోహన్, ఫిరోజ్, మహేష్ తదితరులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.