న్యూఢిల్లీ: మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను భారతదేశంలో నియంత్రించ డం పట్ల ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బచెలెట్ జెరియా విచారం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను నిరోధించి వాటికి విదేశీ నిధులు అందకుండా ఆంక్షలు విధించడానికి అస్పష్ట పదాలతో కూడిన చట్టాలను ఉపయోగించడంపై మంగళవారం ఆమె విచారం వ్యక్తం చేశారు.
మానవ హక్కుల కార్యకర్తలు, సంబంధిత స్వచ్ఛంద సంస్థలకు చెందిన హక్కులను పరిరక్షించి వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల తరఫున తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని ఆమె కోరారు. సుదీర్ఘ కాలంగా బలమైన పౌర సమాజం గల భారతదేశం దేశంలోను వెలుపల మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషిచేసిందని ఆమె గుర్తు చేశారు. అయితే మానవ హక్కుల కోసం పోరాడుతున్న స్వరాలను అణచివేయడానికి అస్పష్ట నిర్వచనాలతో కూడిన చట్టాలను ఉపయోగించడం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సిఆర్ఎ) ఉపయోగించడం ద్వారా మానవ హక్కుల సంస్థలకు అందుతున్న విదేశీ నిధులపై ఆంక్షలు విధించడం ఆందోళన కలిగిస్తోందని బచెలెట్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, బచెలెట్ ప్రకటనపై భారత ప్రభుత్వం స్పందించవలసి ఉంది.
UN Human Rights Chief asks to India on NGOs Rights