Saturday, April 20, 2024

ఆన్‌లాక్ 5.0: తెరుచుకోనున్న థియేటర్లు..!

- Advertisement -
- Advertisement -

తెరుచుకోనున్న థియేటర్లు
సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు
ఇక ‘మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు’
మరికొన్ని వారాలు ప్రాథమిక తరగతులు బంద్
పండగల సీజన్ నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఉండే అవకాశం
నేడో రేపో ఆన్‌లాక్ 5.0 ప్రకటించనున్న కేంద్రం

Unlock 5.0 Updates: Theaters Resume from Oct

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రప్రభుత్వం ప్రతినెలా కొన్ని మినహాయింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. వీటి ఫలితంగా ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కాగా మరో రెండు రోజుల్లో అన్‌లాక్ 4.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడో రేపో అన్‌లాక్ 5.0ను ప్రకటించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెట్రో సర్వీసులకు, నిబంధనలతో 9-12 తరగతుల విద్యార్థులకు మినహాయింపులు ఇచ్చారు. అక్టోబర్ 1నుంచి అన్‌లాక్ 5.0 అమలులోకి రానుంది. దీంతో అక్టోబర్‌నెలలో వేటికి మినహాయింపులు ఇస్తారా? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత వారం వర్చువల్‌గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాలవారీగా వారి అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. కంటైన్‌మెంట్ జోన్లను ‘మైక్రో కంటైన్‌మెంట్‌జోన్లు’గా గుర్తించాలన్న సూచనలు, సలహాలు వచ్చాయి. త్వరలో దసరా, దీపావళి పండగల సీజన్ మొదలవనున్నందున మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయి.
* ఇప్పటికే నిబంధనలతో మాల్స్, రెస్టారెంట్లు, సెలూన్లు, జిమ్స్ తెరిచేందుకు అనుమతించినందున ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశముంది.
* అక్టోబర్‌లోనైనా సినిమా హాళ్లకు అనుమతిస్తారన్న ఆశతో ఆ పరిశ్రమ ఉంది. వీటికి అనుమతి ఇవ్వాలని అన్‌లాక్‌లు ప్రకటించే ప్రతి సమయంలోను సనీపరిశ్రమ వర్గాలు ప్రభుత్వం కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినా వైరస్ తీవ్రత దృష్టా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అయితే సీటు విడిచి సీటులో కూర్చునే నిబంధనలతో థియేటర్లకు అనుమతిస్తే బాగుంటుందని సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఇప్పటికే కేంద్రానికి సూచించారు. అయితే గత నెల అన్‌లాక్ 4.0 ప్రకటించిన సందర్భంగా కేంద్రంసెప్టెంబర్ 21నుంచి ఓపెన్‌ఎయిర్ థియేటర్లను తెరవడానికి మాత్రమే అనుమతించింది. అయితే ఈ సారి ఖరే సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా భౌతిక దూరం కోసం ఒక వరస సీట్లను విడిచిపెట్టే అవకకాశం ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్టోబర్ 1నుంచి తమ రాష్టంలో ధియేటర్లు, సినిమా హాళ్లను తెరవడానికి అనుమతించింది. దేశంలో ఈ అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రం అదే కావడం గమనార్హం.
* కరోనాతో అత్యధికంగా నష్టపోయిన రంగం పర్యాటకం. అయితే కేంద్రం తాజ్‌మహల్ లాంటి కొన్ని పర్యాటక కేంద్రాలను తెరవడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో అన్‌లాక్ 5.0లో మరిన్ని పర్యాటక ప్రాంతాల సందర్శనకు పచ్చజెండా ఊపే అవకాశముంది. ఇటీవలే ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యాటకులు తమ రాష్ట్రంలోకి ఎలాంటి షరతులు లేకుండా ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది కూడా.
* ఇప్పటికే 9-12 తరగతుల విద్యార్థుకు అనుమతిచ్చినందున ప్రాథమిక విద్యాసంవత్సరంపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే ప్రైమరీ తరగతులు మరికొన్ని వారాలపాటు మూతపడి ఉండే అవకాశముందని ఈ పరిణామాల గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి. అయితే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మాత్రం ఇప్పటికే తమ అడ్మిషన్ టెస్టుల ప్రక్రియను ప్రారంభించడంతో వాటికి సంబంధించి కొత్త విద్యాసంవత్సరం త్వరలోనే ఆన్‌లైన్ తరగతుల ద్వారా ప్రారంభం కానుంది. అలాగే రవాణా సర్వీసులకు సంబంధించి మరికొన్ని మినహాయింపులు కూడా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.

Unlock 5.0 Updates: Theaters Resume from Oct

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News