ఘజియాబాద్ పోలీసులు జారీ
ఘజియాబాద్(యుపి): ఒక ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని ఆదేశిస్తూ ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్కు ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ కేసుకు సంబంధించి ట్విటర్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కారణంగా వారం రోజుల్లోగా లోని బార్డర్ పోలీసు స్టేషన్లో హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వాలని ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి ఘజియాబాద్ పోలీసులు నోటీసులో ఆదేశించినట్లు ఒక పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు.
జూన్ 5వ తేదీన కొందరు వ్యక్తులు తనను కొట్టి జై శ్రీరామ్ అని పలకాలని డిమాండ్ చేశారని ఒక ముస్లిం వృద్ధుడు చెబుతున్న వీడియోను ప్రచారం చేసినందుకు ట్విట్టర్ తోపాటు ది వైర్ న్యూస్ వెబ్సైట్, కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులపై ఘజియాబాద్ పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మతపరమైన అలజడిని సృష్టించేందుకే ఈ వీడియోను ప్రచారం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో ట్విట్టర్ ఇన్కార్పొరేషన్, ట్విటర్ కమ్యూనికేషన్స్ ఇండియా, న్యూస్ వెబ్సైట్ ది వైర్, జర్నలిస్టులు మొహమ్మద్ జుబేర్, రానా అయ్యూబ్, కాంగ్రెస్ నాయకులు సల్మాన్ నిజామి, మస్కూర్ ఉస్మాని, షమా మొహమ్మద్, రచయిత సబా నఖ్వీ పేర్లను పొందుపరిచారు.