మెగా మేనల్లుడు, సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో వైష్ణవ్తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. దీంతోపాటు ఇటీవల విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో విడుదలకు ముందే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. చాలా రోజుల తర్వాత మళ్లీ థియేటర్లు ఓపెన్ చేయడంతో పలు సినిమాలు విడుదల కాగా, మరికొన్ని సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నటుడు విజయ్సేతుపతి విలన్గా నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Uppena Movie to release on Feb 12