వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతామండలి పరిమిత విస్తరణ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు తమ దేశం కృషి చేస్తుందని అమెరికా తెలిపింది. శాశ్వత, తాత్కాలిక సభ్యుల సంఖ్యను విస్తరించడం వల్ల భద్రతామండలి సామర్థం ఏమీ తగ్గదని, వీటోలో మార్పుగానీ, విస్తరణగానీ ఉండదని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైస్ అన్నారు. భద్రతామండలి విస్తరణ విషయంలో రానున్న వారాల్లో భారత్తో సన్నిహితంగా పని చేయనున్నట్టు ఆయన తెలిపారు. భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా పట్టుబడుతుందా అన్న ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానమిచ్చారు. విలువలు, ఆకాంక్షలకు సంబంధించిన పలు అంశాల్లో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఆయన అన్నారు. తమ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పని చేస్తున్నామన్నారు. ఐరాస సాధారణ సభ సెప్టెంబర్లో సమావేశం కానున్న నేపథ్యంలో ప్రైస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉన్నది.
ప్రస్తుతం భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వముండగా, పది దేశాలకు రెండేళ్ల వ్యవధికి తాత్కాలిక సభ్యత్వమిస్తున్నారు. శాశ్వత సభ్య దేశాలైన అమెరికా,రష్యా,చైనా,యుకె,ఫ్రాన్స్లకు వీటో అధికారాలున్నాయి. భద్రతామండలి సంస్కరణల విషయంలో సాగదీతకు తావివ్వకుండా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ ఏడాది జూన్లో భారత్ స్పష్టం చేసింది. భద్రతామండలిని విస్తరించాలని డిమాండ్ చేస్తున్న భారత్, జపాన్,జర్మనీ,బ్రెజిల్ దేశాలను జి4 దేశాలుగా పిలుస్తున్నారు.