Tuesday, April 23, 2024

చైనా బెలూన్ కూల్చివేత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : తమ దేశ గగనతలంలో, అణు కేంద్రంపై సంచరిస్తూ ఉన్న చైనా స్పై బెలూన్‌ను అమెరికా సైన్యం ఆదివారం కూల్చివేసింది. అట్లాంటిక్ సముద్రంపై ఇది ఉన్న దశలో అత్యంత చాకచక్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ బెలూన్ కూల్చివేత జరిగింది. ఈ బెలూన్ శకలాలలను , ఇందులోని కీలక పరికరాలను సేకరించేందుకు వెంటనే అమెరికా నౌకాదళాలు రంగంలోకి దిగాయి. ప్రెసిడెంట్ జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఈ బెలూన్ కూల్చివేతకు దిగిందని , సౌత్ కరోలినాలో అమెరికా తీరానికి దాదాపుగా ఆరు మైళ్ల దూరంలో మిర్టిల్ బీచ్ సమీపంలో ఈ చర్యకు దిగినట్లు రక్షణ అధికారి ఒకరు వాషింగ్టన్‌లో విలేకరులకు తెలిపారు. ఈ కూల్చివేత దశలొ అమెరికన్ల ప్రాణాలకు ఆస్తులకు ఎటువంటి నష్టం కలుగకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని వివరించారు. ఎఫ్ 22 యుద్ధ విమానం నుంచి ఎయిర్ ఇంటర్‌సెప్ట్ క్షిపణి 9 ఎక్స్ సైడ్ విండర్‌ను ప్రయోగించి బెలూన్‌ను కూల్చివేశారు. తీరానికి ఆరు నాటికల్ మైళ్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంపై ఈ ఆపరేషన్ బెలూన్ సాగింది.

బెలూన్ శకలాలు ఏడు మైళ్ల విస్తీర్ణంలో 47 అడుగుల లోతున నీటిలో పడ్డాయి. వర్జీనియాలోని లాంగ్లే వైమానిక స్థావరం నుంచి ఫైటర్ దూసుకువెళ్లింది. బెలూన్‌ను మిస్సైల్‌తో దెబ్బతీసింది. ఈ బెలూన్‌ను కూల్చివేయాలని తాము ఆదేశించినట్లు ఇదే దశలో దేశాధ్యక్షులు బైడెన్ మేరీలాండ్‌లోన హెగర్‌స్టవున్‌లో విలేకరులకు తెలిపారు. తనకు ఎప్పటికప్పుడు ఈ బెలూన్ కదలికల గురించి సమాచారం అందుతూ వచ్చిందని , పరిస్థితిని పూర్తి స్థాయిలో గమనించి కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు బైడెన్ చెప్పారు, నేలపై ఎటువంటి ముప్పు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూడాలని ఆదేశించినట్లు వివరించారు. సముద్ర జలాల పైకి ఇది వచ్చిన దశను గుర్తించి దెబ్బతీసేందుకు ఎంచుకున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ ఆదేశాల మేరకు దేశ నార్తర్న్ కమాండ్ బాధ్యతలు తీసుకుని ఈ బెలూన్‌ను కూల్చివేసిందని రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ తెలిపారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన ఈ హై అల్టిట్యూడ్ నిఘా బెలూన్‌ను కూల్చివేశారని ప్రకటించారు.

ఈ బెలూన్‌ను చైనా గూఢచార్య చర్యలకు వాడిందని, అమెరికా ఖండంలోని అత్యంత వ్యూహాత్మక కీలక స్థావరాల సమాచార సేకరణకు రంగంలోకి దింపిందని నిర్థారణ అయిందని ఆస్టిన్ తెలిపారు. ఈ భారీ స్థాయి మూడు బస్సుల సైజు బెలూన్ కూల్చివేత పూర్తి స్థాయిలో పలు విధాలైన సమన్వయ చర్యలతో ప్రత్యేకించి కెనడా ప్రభుత్వ పూర్తి సహకారం మద్దతుతో చేపట్టినట్లు వివరించారు. తమకు అత్యంత కీలకమైన మినిట్ మ్యాన్ 3క్షిపణుల సంబంధిత వివరాలను సేకరించేందుకు ఈ బెలూన్ పంపించినట్లు నిర్థారణ అయిందని అమెరికా ధృవీకరించుకుంది. తగు విధంగా చర్యకు దిగిందని వెల్లడైంది. ఈ వంద క్షిపణులను నేలమాళిగలలో దూరం దూరంగా ఉంచారు. అయితే ఈ ప్రాంతంలోని సెల్ టవర్లకు చైనా సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. ఇది అధికారికంగానే జరుగుతోంది. అయితే ఈ టెక్నాలజీ సాయంతోనే చైనా ఇక్కడి క్షిపణుల సమాచారం సేకరించుకుని , ఇక్కడనే చాలా రోజులుగా సంచరిస్తోన్న బెలూన్ ద్వారా దీనిని సంగ్రహించేందుకు రంగం సిద్ధం చేసుకుందని అమెరికా రక్షణ శాఖ పసికట్టింది. ఈ నేపథ్యంలోనే బెలూన్ కూల్చివేత జరిగింది.
తీవ్ర పరిణామాలు తప్పవు . తగు విధంగా స్పందిస్తాం

అమెరికా చర్యపై స్పందించిన చైనా

తమది నిఘా బెలూన్ కాదని కేవలం శాస్త్రీయ పరిశోధనల క్రమపు ఎయిర్ షిప్ అని తెలిపినా దీనిపై కూల్చివేతకు దిగిన అమెరికా చర్య అనుచితం అని బీజింగ్‌లో చైనా అధికారులు స్పందించారు. ఈ కూల్చివేతకు తగు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా చర్య పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అతిగా వ్యవహరించిందని ఇతరుల చట్టబద్ధమైన హక్కులు ప్రయోజనాల విషయంలో చైనా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుంది. అయితే తమ వైపు నుంచి కూడా తరువాతి చర్య ఉండకపోదని సంకేతాలతో ప్రకటన వెలువరించారు. పౌర వినియోగం సంబంధిత సమాచారం ప్రత్యేకించి భూమి వాతావరణ పర్యవేక్షణకు పంపించిన మానవరహిత ఎయిర్‌షిప్ అని చెపుతున్నా దీనిని కూల్చివేశారని, దీనిపై తగు విధంగానే తమ ప్రతిస్పందన ఉంటుందని చైనా అమెరికాకు పరోక్ష హెచ్చరికలు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News